మెదక్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సీఎంఆర్ ఈనెల 31 వరకు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జిల్లాలో అధికశాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈనెల 31వతేదీ వరకు ఉందన్నారు. 13నెలలు గడుస్తున్నా పూర్తిచేయని మిల్లర్ల అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. రైతుల నుంచి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి సమకూర్చిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరుపుతూ ఈనెలాఖరులోగా ఎఫ్సీఐకి చేరవేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రైస్మిల్లులో పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని తేల్చిచెప్పారు. సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున ఇకపై మిల్లర్ల అలసత్వాన్ని సహించేదిలేదన్నారు. మిల్లర్లు పంపించే సీఎంఆర్ నిల్వలను వెనువెంటనే దిగుమతి చేసుకునేలా గోదాముల వద్ద కూలీల సంఖ్య పెంచాలని ఎఫ్సీఐ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీసీఎస్వో బ్రహ్మరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, రైస్ మిల్లర్లు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.