మెదక్,జూలై 22 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రహదారుల భద్రత పై వివిధశాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..మెదక్ జిల్లాను జీరో యాక్సిండెంట్ జోన్గా తీర్చిదిద్దాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసు, రవాణా, ఇంజినీరింగ్శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి పక్కన అక్రమంగా స్థలాలు ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. పెట్రోల్ బంకులు, షాపులకు లైసెన్స్లు జారీ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలన్నారు. నేషనల్ హైవే టాస్క్ఫోర్స్ టీం ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు.
బ్లాక్ స్పాట్స్ గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు లైటింగ్, బారికేడ్లు, రేడియం స్టిక్కర్స్, స్పీడ్ కంట్రోలింగ్ పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రామాయంపేట జంక్షన్ వద్ద రోడ్డు భద్రత పై ప్రత్యేక నిబంధనలు పటిష్టింగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు, మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్అండ్బీ ఈఈ శంకర్,జాతీయ రహదారి అధికారులు,పోలీసులు పాల్గొన్నారు.