సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 19: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ నేతృత్వంలో అధికారికంగా బతుకమ్మ సంబురాలు జరిపారు. ఈ ఉత్సవాల్లో మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ పేర్చి పాటలు పాడారు. ముందుగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్రెడ్డి దంపతులు గౌరీమాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తున్నటట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు. ప్రకృతికి ప్రతిరూపం దుర్గామాత అని, దేవున్ని పూజించడం మూలంగా మనసులో ప్రశాంతత ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ బతుకమ్మ, దసరా పండుగలు సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు చెప్పారు. సీపీ శ్వేత మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబురాలతో వారి ముఖాల్లో సంతోషం కనబడుతున్నదన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. బతుకమ్మ సంబురాలతో కలెక్టరేట్కు కొత్తశోభ తెచ్చిందన్నారు. కలెక్టర్ కూతురు పద్మజ పాడిన బతుకమ్మ పాట, చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఉత్సవాల్లో డీఆర్వో నాగరాజమ్మ, డీపీవో దేవకీదేవి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సరోజ, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు, టీఎన్జీవో నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.