గజ్వేల్, మార్చి 16: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, భూ సేకరణకు సహకరించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జగదేవ్పూర్, మర్కూక్ మండలాల పరిధిలోని చెబర్తి, అలిరాజ్పేట, పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో ఆర్బిటరేషన్ ప్రక్రియ గురించి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం మీదుగా రీజినల్ రింగ్రోడ్డు వెళ్తున్నందున ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం శుభపరిణామమన్నారు. ప్రజా అవసరాల కోసం భూములు త్యాగం చేస్తున్న వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. భూములు త్వరగా అప్పగించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ నిర్మల, రైతులు పాల్గొన్నారు.