హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): క్రైస్తవులకు అండగా నిలుస్తామని, త్వరలో మెదక్ చర్చిని సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావుతో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చర్చిల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, కొత్త చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవుల శ్మశాన వాటికలకు అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు ముందు మెదక్ చర్చిని సందర్శించానని, మరోసారి చర్చిని సందర్శిస్తానని తెలిపారు. తమ ప్రభుత్వంలో మతపరమైన స్వేచ్ఛ ఉంటుందన్నారు. తెలంగాణలో మాదిరిగా కేంద్రంలోనూ లౌకిక ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రెవరెండ్ జాన్జార్జ్, డాక్టర్ ఏఎంజే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్ పాల్గొన్నారు.