సీఎం కేసీఆర్ పటాన్చెరు పర్యటన ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో కొల్లూరు డబుల్ బెడ్రూం ప్రారంభోత్సవంతో పాటు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమాలు విజయవంతమవడంతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వరాలపై అన్ని వర్గాలు సంబురాలు చేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో పటాన్చెరులో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. మియాపూర్ నుంచి పటాన్చెరుకు మెట్రో పొడిగింపు, ఐటీ కంపెనీల ఏర్పాటుపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలు, డివిజన్లు, పంచాయతీలకు రూ.128 కోట్లు ఇస్తామని చెప్పడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో రెండు వేల ఇండ్లు ఈ నియోజకవర్గానికి కేటాయిస్తామని పేర్కొనడంతో సొంతింట కల సాకారంకానున్నది. సూపర్ స్పెషాలిటీ దవాఖానతో కార్మికులు, పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి హామీలపై శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, ధన్యవాదాలు తెలిపారు.
పటాన్చెరు, జూన్ 23: సీఎం కేసీఆర్ రాక పటాన్చెరులో పండుగ వాతావరణాన్ని తలపించింది. సీఎం కేసీఆర్ పారిశ్రామికవాడపై కురిపించిన వరాల జల్లులో స్థానికులు తడిసిముద్దయ్యారు. వరుసగా నిధులు కేటాయిస్తూ ఇచ్చిన హామీలకు ప్రజలు కేరింతలు, చప్పట్లతో స్వాగతించారు. పటాన్చెరులో 2వందల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేయడంతో తమ ఆరోగ్యాలకు భరోసా ఏర్పడిందని ప్రజలు ధీమాతో ఉన్నారు. గురువారం భూమిపూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుతో కలిసి వేదికపై ప్రసంగించారు. తాము చేసిన అభివృద్ధి పనులను చూసి మళ్లీ ఆశీర్వదించాలని సీఎం కోరారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని మరోమారు దీవించాలని కోరడంతో సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి. మరోమారు పటాన్చెరు నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బరిలో ఉంటారని చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సంబురాలకు దిగారు. ఈ ప్రకటనతో పటాన్చెరు ప్రాంతం మురిసిపోతున్నది. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున రూ.90 కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. వీటితోపాటు జీహెచ్ఎంసీలోని మూడు డివిజన్లకు రూ.30 కోట్లు ఇస్తామని హామీనిచ్చారు. అంతేకాకుండా 55 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పారు. కొల్లూర్లోని డబుల్బెడ్రూంలలో పటాన్చెరు డివిజన్లకు 2వేలు కేటాయిస్తామని చెప్పడంతో పట్టణ నిరుపేదల్లో కొత్త జోష్ కనిపించింది. పటాన్చెరును రెవెన్యూ డివిజన్గా చేస్తామని, మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో రైల్ను పొడిగిస్తామని చెప్పడంతో చప్పట్ల వర్షం కురిసింది. కోరిన ప్రతి కోరికను సీఎం తీర్చడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఆనందంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్చెరు పర్యటన బీఆర్ఎస్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈప్రాంత ప్రజలకు సీఎం కేసీఆర్ భారీగా వరాలు అందజేయడం సంతోషాన్ని కల్గించింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని తిరిగి దీవించండి అనడంతోనే పటాన్చెరు బీఆర్ఎస్ వర్గాల్లో కొత్త జోష్ వచ్చింది. ఇదే ధీమాతో ఎమ్మెల్యే ఇప్పుడు మరింత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తారని పార్టీ శ్రేణులు సంబురంగా చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా పటాన్చెరు ప్రాంతంలో ప్రతి గల్లీ తనకు తెలుసని చెబుతూ పాత రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. సదాశివరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను అన్ని గల్లీలు తిరిగానని చెబుతూ స్థానికులను పాతరోజుల్లోకి తీసుకువెళ్లారు. పటాన్చెరును కొత్త రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పడంతో ఈ ప్రాంతం అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. జనాభాపరంగా చాలా పెద్ద నియోజకవర్గం కావడంతో రెవెన్యూ డివిజన్ చేయడం ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేయడమని అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు పట్టణ పేదలకు 2వేల బెడ్రూమ్లు కొల్లూరులో ఇస్తామని చెప్పడంతో పటాన్చెరుపై సీఎం ప్రేమను చాటింది. పట్టణ పేదలు ఆయన చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల రావడంతో ఈ ప్రాంతంలో టెక్నికల్ విద్య అందుబాటులోకి రానున్నది. కొల్లూర్, ఉస్మాన్నగర్లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించి, వాటిని నెలకొల్పేలా చూడాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను పంపిస్తామని సీఎం చెప్పడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేపాయి.
పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం, అమీన్ఫూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నానని చెప్పడంతో మున్సిపల్ పాలక మండళ్లు సీఎం కేసీఆర్ను కొనియాడుతున్నారు. మున్సిపాలిటీల్లో సంపూర్ణమైన అభివృద్ధికి రూ.90 కోట్లు ఉపయోగపడుతాయని అభిప్రాయ పడుతున్నారు. జీహెచ్ఎంసీలోని భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లకు రూ.10 కోట్ల చొప్పున అందించనున్నట్లు ప్రకటన చేశారు. రూ.30 కోట్లు మూడు డివిజన్లకు వస్తాయి. మరో పక్క పటాన్చెరు నియోజకవర్గంలోని 55 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున అందజేస్తామని హామీనిచ్చారు. ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలతో సభికులు హర్షధ్వానాలు చేస్తూ స్వాగతించారు.
పటాన్చెరు సభలో సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలకు మరోసారి వరాల జల్లు కురిపించడంపై చాలా సంతోషం. ఆయన అభివృద్ధి ప్రదాత. గతంలోనే మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేయగా, మరోసారి మున్సిపాలిటీలను అన్నివిధాలా మరింతగా అభివృద్ధి చేసుకునేలా రూ.30 కోట్లు వరంగా ప్రకటించడం సంతోషంగా ఉంది. అభివృద్ధే మంత్రంగా మున్సిపాలిటీలకు చేయూతనందించిన సీఎం కేసీఆర్కు బొల్లారం మున్సిపల్ పాలకవర్గం, ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– కొలన్ రోజాబాల్రెడ్డి,
తెల్లాపూర్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ రూ.30 కోట్లు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. గతంలో జహీరాబాద్ సభలో సీఎం కేసీఆర్ రూ.25కోట్లు ప్రకటన చేశారు. ఆ నిధులతో మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు పటాన్చెరులో రూ.30 కోట్లు నిధులు ప్రకటన చేయడం తమ అదృష్టం. మున్సిపాలిటీలోని అన్ని వార్డులను మరింతగా అభివృద్ధి చేసుకుంటాం.
– లలితాసోమిరెడ్డి, తెల్లాపూర్ చైర్పర్సన్, ఆర్సీపురం
సీఎం కేసీఆర్ అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగుతున్నారు. పటాన్చెరులో జరిగిన సభలో ఆర్సీపురం డివిజన్ అభివృద్ధికి రూ.30 కోట్లు ప్రత్యేక నిధులు ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. ఆర్సీపురం డివిజన్లో పెండింగ్లో ఉన్న సమస్యలను సీఎం ప్రత్యేక నిధులతో పరిష్కరిస్తాం. డివిజన్ను మరింతగా అభివృద్ధి చేసుకుంటాం.
– పుష్పానగేశ్ కార్పొరేటర్, ఆర్సీపురం
సీఎం కేసీఆర్ భారతీనగర్ డివిజన్ అభివృద్ధి కోసం రూ.30 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. డివిజన్ అభివృద్ధికి సీఎం ప్రకటించిన నిధులు ఎంతో దోహదపడుతాయి. ప్రత్యేక నిధులతో డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. గతంలో ఎప్పుడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరుగుతుంది.
– సింధూఆదర్శ్రెడ్డి, భారతీనగర్ కార్పొరేటర్, ఆర్సీపురం
పటాన్చెరు డివిజన్కు సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు కేటాయించడంపై ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రోత్సహించడంతో పటాన్చెరును అభివృద్ధి చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి మా వినతులను మన్నించి అభివృద్ధికి నిధులు ఇవ్వడం మా డివిజన్లో సంతోషాన్ని నింపింది. ఎమ్మెల్యే సలహాలు, సూచనల మేరకు నిధులు ఖర్చు చేసి డివిజన్ను అభివృద్ధి చేసుకుంటాం.
– మెట్టు కుమార్యాదవ్, పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్