చేర్యాల, నవంబర్ 17 : సీఎం కేసీఆర్ చేర్యాలకు రానుండడంతో ఈప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరనున్నాయని, నియోజకవర్గ ప్రజలు కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని మార్కెట్ యార్డు పక్కన ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభా స్థలాన్ని, ఏర్పాట్లను ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రాజయ్య, స్థానిక నాయకులతో కలిసి పల్లా రాజేశ్వర్రెడ్డి పరిశీలించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఇటీవల జనగామలో సీఎం కేసీఆర్ సభ జరిగిందని, చేర్యాల ప్రాంత ప్రజల కోరిక మేరకు శనివారం చేర్యాల పట్టణానికి ముఖ్యమంత్రి మధ్యాహ్నం మూడు గంటలకు రోడ్డు మార్గంలో రానున్నట్లు తెలిపారు.ప్రజాఆశీర్వాద సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గం సభ విజయం కోసం గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్కు స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయమై జనగామ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, దాన్ని మళ్లీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఖచ్చితంగా డివిజన్ సాధించుకుని ముందుకు వెళ్దామన్నారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు చేర్యాల ప్రాంతం కేసీఆర్ వెంట నడిచిందని,ఇప్పుడు అదే దారిలో వెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నారు.
సిద్దిపేట, గజ్వేల్లో జెండా ఎత్తితే, ఇక్కడ జెండా ఎత్తారని, అక్కడ గజ్జెకడితే ఇక్కడ గజ్జకట్టి పాటలు పాడి కేసీఆర్కు, ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినట్లు గుర్తుచేశారు. గజ్వేల్ సమీపంలో ఉన్న కేసీఆర్కు ఇక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధం ఉందని, చేర్యాల అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్తో మాట్లాడి అధిక నిధులు తెచ్చుకుందామన్నారు.ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చెప్పింది వింటారని, బీఆర్ఎస్కు అండగా ఉంటారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని రెండుసార్లు ఎలా ఆదరించారో తనను కూడా ఆదరించాలని, అదే విశ్వాసం నాపై, బీఆర్ఎస్ పార్టీపై ఉండాలని కోరారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సుశిక్షుతులైన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పల్లా కోరారు.అనంతరం పల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సభ ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీటి వసతి, వలంటీర్లు తదితర అంశాల పై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, టౌన్, మం డల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, మల్లన్న ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కిష్టయ్య,జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యుడు మేడిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు చంటి, నరేందర్, సతీశ్, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య పాల్గొన్నారు.
చేర్యాల, నవంబర్ 17 : చేర్యాల పట్టణంలో శనివారం బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ జరగనున్నది. సీఎం కేసీఆర్ హాజరుకానున్న బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల టౌన్, చేర్యాల రూరల్, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, నర్మెట్ట, తరిగొప్పులు, జనగామ టౌన్, జనగామ రూరల్, బచ్చన్నపేట మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం కేసీఆర్ సభ హాజరుకానున్నారు. ప్రజలకు తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, విద్యుత్ తదితర వసతులు కల్పించారు.
చేర్యాల పట్టణంలోని మార్కెట్ యార్డు పక్కన ఉన్న 10 ఎకరాల స్థలంలో ప్రజా ఆశీర్వాద సభా స్థలాన్ని నిర్ణయించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకు న్నారు. జనగామ నుంచి చేర్యాల వైపునకు వచ్చే బచ్చన్నపేట, జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల మండలాల ప్రజల కోసం చేర్యాల, ముస్త్యాల గ్రామాల మధ్య ఉన్న 20 ఎకరాల ఖాళీ ప్రదేశంలో మూడు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.కొమురవెల్లి, చేర్యాల రూరల్ మండలం, మద్దూరు, ధూళిమిట్ట మండలాల నుంచి వచ్చే ప్రజల కోసం పట్టణంలోని కస్తూర్బాగాంధీ సమీపంలో, కేపీఆర్ కాలనీ వెనుక భాగంలో రెండు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. బచ్చన్నపేట మండలంలోని కొన్ని గ్రామాలు, చేర్యాల మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలకు సభా ప్రాంగణానికి సమీపంలో మరో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. సభా స్థలాన్ని, పార్కింగ్ స్థలాలను పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ప్రభుత్వ మాజీ చీఫ్ విఫ్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర సీనియర్ నాయకుడు జల్లి సిద్ధయ్య, ఆప్కో రాష్ట్ర మాజీ చైర్మన్ మండ ల శ్రీరాములు తదితరులు సందర్శించారు.