చేర్యాలలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ విజయవంతమైంది. కనీవినీ ఎరుగని రీతిలో సభకు జనం పోటెత్తారు. భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ 42 నిమిషాల పాటు మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు భరోసా కల్పించారు. చేర్యాల కాడ ఒక సభ పెడితే సాలు సార్ అని పల్లా రాజేశ్వర్రెడ్డి తనను ఇక్కడికి రప్పించారని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత జనం మధ్యన నిలబెట్టి ఈ కళాశాల, ఆ కళాశాల కావాలని అడుగుతున్నాడని అని చెప్పారు. ఎమ్మెల్యే కాకముందే నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని వాటి పరిషార్కానికి తపన పడే ఇట్లాంటి మంచి నాయకుడు ఉండాలె అంటూ పల్లాపై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. రెవెన్యూ డివిజన్ కావాలని మీరంతా కోరుతున్నారని, దానికోసం రంది పడుతున్నారని తెలిసిందని, పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపిస్తే నెల రోజుల్లోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో మరిన్ని కళాశాలలు కూడా వస్తయ్ అని భరోసా ఇచ్చారు.
‘చేర్యాల చైతన్యవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతమంటే నాకెంతో ఇష్టం. నేను చేర్యాలలోనే హిందీ భాష నేర్చుకున్నా. ఇక్కడ నాకు దోస్తులున్నరు.. బంధువులున్నరు. ఉద్యమ సమయంలో బచ్చనపేటకు వస్తే నీళ్లు లేక ఎండిన చెరువును చూస్తే బాధేసింది. ఇప్పుడు ఇక్కడి చెరువుల్లో నిండుగా నీళ్లు, పచ్చని పంటలను చూస్తే సంతోషంగా ఉంది. మా పల్లా రాజేశ్వర్రెడ్డి ఎందుకో రందిపడుతుండు. పొన్నాల లక్ష్మయ్య దీవెన.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశీర్వాదంతో ఇంతపెద్ద సభను చూసిన తర్వాత పల్లా గెలుపు ఖాయమైంది.’
సిద్దిపేట, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “చేర్యాల ప్రాంతం చైతన్యమైన గడ్డ ,ఈ ప్రాంతం అంటే ఇష్టం ..చేర్యాల ఒకప్పుడు సమితి ఉండేది..ఆసమితి పోయింది..చేర్యాల నియోజకవర్గం ఉండేది..అదిపోయింది..ఏదో ఎలితి కనబడుతుంది. మీరు బాధతోనే ఉన్నారు. అందుకే రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారు. మీరు రాజేశ్వర్రెడ్డిని గెలిపించండి..నెల రోజుల్లోనే రెవెన్యూ డివిజన్ చేయించి బ్రహ్మండంగా ప్రారంభోత్సవం చెద్దాం” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణ కేంద్రంలో శనివారం “ ప్రజాఆశీర్వాద సభ” జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. 42 నిమిషాలు జనగామ నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. మీకు తెల్వని విషయం కూడా ఉంది. ఇక్కడ నాక్లాస్మెంట్లు అనేక మంది ఉన్నారని చెప్పారు. తామంతా రార పోరా అని పిలుచుకునేటోళ్లం,లద్దూనూరు, మద్దూరు, తరిగొప్పలలో వందల మంది ఉన్నారన్నారు. వాళ్లంతా తన ప్రాణ మిత్రులన్నారు. సిద్దిపేటలో ఇంటర్ చదువుకున్నప్పుడు చేర్యాలలో ఒక హిందీ టీచర్ ఉండే అని చెప్పారు. సైకిల్ మీద రోజూ సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చి హిందీ నేర్చుకొని పోయానని, హిందీ విశారద పాసైంది కూడా ఇక్కడే అన్నారు. మీకు చాలా మందికి తెల్వదు..చేర్యాల సార్ వద్దనే హిందీ చదువుకునే బయటకు వెళ్లి హిందీ మాట్లాడుతున్నారన్నారు. హిందీలో మాట్లాడాలంటే గంటసేపు మాట్లాడుతానన్నారు. ఇక్కడ చదువుకున్న కాబట్టి ..చేర్యాల పెట్టిన భిక్ష అని చెప్పారు.
ఎన్నోసార్లు చేర్యాల నుంచి జనగామకు వెళ్లానన్నారు. మన పక్కకు ఉన్న చెరువులో ఎన్నడూ కూడా చారెడు నీళ్లు కనిపించలేదన్నారు. ఏరోజ కూడా నిండకపోతుండే, చాలా భయంకరమైన పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి పోతుంటే తన వెంట ఉన్న మిత్రులు ఇక్కడ మాట్లాడండి సార్ చాలా మంది ఉన్నారు అని ఆరోజు నాకు చెప్పితే అక్కడ ఆగానన్నారు. అక్కడ జీపు ఎక్కి మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన వారంతా వృద్ధులు మాత్రమే ఒక యువకుడు కూడా లేరు. ఏమైంది ఒక్క యువకుడు కూడా లేడంటే ఎక్కడ సార్ గత కొన్నేండ్లుగా అం తా కరువు మొత్తం ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పోయిండ్రు అని చెప్పారన్నారు. వెంటనే జీపు దిగి అక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడితే ఆరోజు వారు చెప్పిన మాటలు తాగునీళ్లు కూడా దొరుకుతలేవు, నాలుగు కిలోమీటర్ల కొద్ది దూరం పోయి ఎడ్ల బండి మీద తెచ్చుకుంటున్నామని చెప్పారని గుర్తు చేశారు. ఏడేండ్లు ఆయింది మా చెరువు ఎండిపోయి చుక్క నీరు లేదు, బతకలేని పరిస్థితి ఉంది అని చెప్పితే తనకు దుఃఖం వచ్చి ఏడ్చానని చెప్పారు.ఇయాళ భగవంతుడి దయతో గత పదేండ్ల నుంచి బచ్చన్నపేట చెరువు నిండుకుండలా మారిందన్నారు.
“పల్లా రాజేశ్వర్రెడ్డి చాలా తెలివిగలవాడు.. మంచి విద్యావంతుడు, ఉద్యమాల్లో పని చేసినవాడు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినవాడు,ప్రజాసమస్యలపై చాలా అవగాహన ఉన్నవాడు, పట్టున్న మనిషి” అని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లా రాజేశ్వర్రెడ్డి గింత ఉషారు ఉన్నారని తనకు తెలియదన్నారు. చేర్యాల కాడ ఒక సభ పెడితే సాలు సార్ అని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జనం మధ్యన పెట్టి ఈ కళాశాల, ఆకళాశాల కావాలని అడుగుతున్నారు అని చెప్పారు. ఇంకో విషయం ఆలోచన చేయాలి.. గీన్ని కళాశాలలు అడిగినాడు అంటే రాజేశ్వర్రెడ్డికి ఆ ధైర్యం ఎక్కడిది..ఆయనకు అన్ని తెలుసు అని చెప్పారు. 33 మెడికల్ కళాశాలు పెట్టినం, అనేక ఇంజినీరింగ్ కళాశాలలు పెట్టినం, అనేక రకాలుగా ప్రభుత్వం వద్ద ధనం ఉందికాబట్టే ఆధైర్యం పల్లాకు వచ్చిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉంటే మన గతి ఎట్లా ఉండే బచ్చన్నపేట చెరువొలే ఉండేదన్నారు.
యాదన్నకు చెప్పాను…యాదన్న నీవు కూడా క్యాబినెట్ ర్యాంకులో ఆర్టీసీ చైర్మన్గా ఉండు, పెద్ద మనిషిగా గౌరవంగా ఉండు, నీ గౌరవం తక్కువ కావద్దు అని చెప్పి యాదన్నకు చెప్పాను అని సీఎం కేసీఆర్ అన్నారు. నామాట మన్నించి సపోర్టు చేసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి, పెద్దలు పొన్నాల లక్ష్యయ్య వచ్చి రాజేశ్వర్రెడ్డిని ఆశీర్వదించిండ్రు లక్ష్యయ్యకు ధనన్యావాదాలు . పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించండి చేర్యాల రెవెన్యూ డివిజన్తో పాటు ఆయన కోరిన ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అన్ని తెచ్చిచ్చే బాధ్యత తనదే అన్నారు.కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామాల్లో చర్చపెట్టండి. ఎక్కడికక్కడ చర్చ పెట్టడం వల్ల ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో ప్రజలకు ఏం చేసింది. కాం గ్రెస్ 50 ఏండ్లలో ఏంచేసిందో ప్రజలకు తెలుసన్నారు. గత పదేండ్ల నుంచి ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు. తెలంగాణ రాక ముందు ఎలా ఉండే…రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ఇయాళ కాంగ్రెస్ పార్టీవాళ్లు వచ్చి మాట్లాడుతున్నారు. ఎనకటికి ఎవరో అన్నరట వంటలు మీరు వండి పెట్టుండ్రి మేము వచ్చి వడ్డిస్తామన్నరట అట్లా ఉంది కాంగ్రెస్ వాళ్ల తీరు అని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం కొట్లాడినవాడు ఎవడు..ఉద్యమం మొదలు పెట్టినవాడు ఎవ డు..ఆనాడు పేగు తెగేదాక నినదించింది ఎవడు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది ఎవరు. సాధించిన తెలంగాణను నంబర్వన్ చేసింది ఎవరు..? 24 గంటల కరెంట్ తెచ్చింది ఎవరు..? ప్రతి ఇంటికి తాగునీరు తెచ్చింది ఎవరు..? ఇయాళ పంటలకు సాగు నీరు తెచ్చింది ఎవరు..? (ఇవన్నీ కేసీఆర్ చేసిండు అంటు ప్రజలు చెప్పారు) యా ళ్లకు మేము వచ్చి వడ్డన చేస్తామంటారా అని కాంగ్రెస్, బీజేపీలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యా రు. తెలంగాణ రాక ముందు చెట్టుకొకరు, గుట్టకొకరు అయిండ్రు.. వలసలు పోయిండ్రు, రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కో రైతు వందల ఫీట్ల కొద్ది బోర్లు వేసి అప్పుల పాలయ్యారన్నారు. ఎందుకంటే చేర్యాల, సిద్దిపేట కలిసి ఉండే కదా ఆబాధలు తనకు తెలుసన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో ఎన్ని బాధలు పడ్డామో ఈ ప్రాంత వాసులకు అన్ని తెలుసన్నారు. ఆనాడు గోడు గోడు ఏడ్చిన నాడు మనల్ని ఎవరన్న పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసన్నారు.
‘మా రాజేశ్వర్రెడ్డి ఎందుకో బాగా రంది పడుతుండు.. వాడు ఎవడో జనగామకు వచ్చి వర్రిపోయిండట ..కుక్కలు మత్తుగా వర్రుతాయి.. దాన్ని లెక్క పెడతామా మనం’అని సీఎం కేసీఆర్ అన్నారు. నిన్న జనగామలో వొర్రిపోయిన కుక్క ఏంచేసింది తెలుసా..? రైఫిల్ పట్టుకొని ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసింది అంటూ కరీంనగర్కు పోయిండు..ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అని పెట్టిండ్రు, తాను పెట్టింది కాదు వాళ్లు పెట్టిండ్రు అని అన్నారు.
ఇయాళ మనస్సుకు తృప్తిగా ఉంది.. నా పాతజాగకు వచ్చిన, రెండో విషయం హెలికాప్టర్లో రాలేదు. హెలికాప్టర్ వస్తే గన్మెన్ టైం చూపెడుతూ పోవాలి అని అంటాడని సీఎం కేసీఆర్ అన్నారు. కుదార్తగా నాలుగు మాటలు మాట్లాడుకున్నటైం ది. తెలంగాణ యాసలో అంతే కదా అని… కాసేపు నవ్వుకోగలిగాం చేర్యాలలో… (అంటూ నవ్వుతూ), చేర్యాలకు వస్తే తన సొంత ఊరికి వచ్చినట్లు ఉంది, ఆనందంగా మాట్లాడుకున్నాం. కాల్వల నీళ్లు కూడా మల్లన్నసాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీలు నిండు కుండలాగా మన నెత్తి మీదనే ఉంది. తపాస్పల్లి రిజర్వాయర్ రూ. 350 కోట్లు మంజూరు చేసినం ఆకాల్వ పైప్ లైన్ పూర్తవుతుంది. అది పూర్తి అయ్యిందంటే బ్రహ్మండంగా నీళ్లు వస్తాయి. చేర్యాలలో కరువు అనేది మళ్ల అడుగు పెట్టకుండా అట్లా కట్టు బంద్ చేసే బాధ్యత తనదే అన్నారు. అటు దేవాదుల వస్తది. .రంగనాయక సాగర్ నుంచి ఇటు ధూళిమిట్టకునీళ్లు వస్తున్నాయన్నారు. మల్లన్ససాగర్ నుంచి కూడా నీళ్లు వస్తాయన్నారు. అనంతర ప్రజలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.