పటాన్చెరు, సెప్టెంబర్ 20: డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు వరమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన లబ్ధిదారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. రెండో విడతలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దక్కించుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు మిఠాయిలు తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్గిపెట్టెల్లాంటి అద్దె ఇండ్లలో అవస్థలు పడిన ప్రజలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉచితంగా ఇస్తూ ఆదుకుంటున్నారన్నారు.
చాలీచాలని జీతాలతో సామాన్యుల బతుకులు భారంగా ఉంటాయని, ఇంటి కిరాయి కట్టడం సమస్య అని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి నిరుపేదలకు అండగా ఉన్నారన్నారు. పూర్తిగా పారదర్శకంగా, పార్టీలకు, కులమతాలకు అతీతంగా డబుల్బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తున్నామన్నారు. కంప్యూటర్ ద్వారా లాటరీలో ఎంపిక చేసి ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. రెండో విడతగా 500 మందిని ఎంపిక చేశామన్నారు. వారికి కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు.
గురువారం మంత్రి హరీశ్రావు వచ్చి లబ్ధిదారులకు లాటరీ డ్రా ద్వారా బ్లాక్లు, ఇంటి నెంబర్ కేటాయిస్తారన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. రూ.50 లక్షలకు పైగా విలువైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సీఎం కేసీఆర్ ఇస్తున్నారన్నారు. లబ్ధిదారులు పటాన్చెరు క్యాంప్ కార్యాలయానికి గురువారం వస్తే బస్సుల్లో కొల్లూరు తీసుకుని వెళ్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పా నగేశ్యాదవ్, సింధూ ఆదర్శ్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, బీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, శ్రీధర్చారీ తదితరులు పాల్గొన్నారు.