నారాయణఖేడ్, అక్టోబర్ 29: నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సభ కోసం కరస్గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుండగా, సభాస్థలి సమీపంలోనే హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. 50 వేల మంది జన సమీకరణే లక్ష్యంగా సభ నిర్వహిస్తుండగా, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో మొత్తం ఆరు ప్రదేశాలను వాహనాల పార్కింగ్కు కేటాయించగా మన్సూర్పూర్ చౌరస్తా, నాగల్గిద్ద రోడ్డు వద్ద, మనూరు రోడ్డు వద్ద, పంచగామ కమాన్ వద్ద, సేవాలాల్ చౌక్ వద్ద పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేయగా, వీఐపీల కోసం సభాస్థలికి సమీపంలో వాగ్దేవి జూనీయర్ కళాశాల వద్ద వాహనాల పార్కింగ్కు కేటాయించారు. 450 మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సభాస్థలి వద్ద ప్రత్యేక భద్రత ఉంటుంది. ఆదివారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ రూపేశ్ సభాస్థలిని సందర్శించి, స్థానిక డీఎస్పీ వెంకట్రెడ్డికి పలు సూచనలు చేశారు. సీఎం సభాస్థలితో పాటు హెలిప్యాడ్ వద్ద డాగ్స్కాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు.
రెండు ఎన్నికల్లోనూ ప్రజల ఆశీస్సులతో తాను భారీ మెజార్టీతో గెలుపొందగా, ఈసారి ప్రజల స్పందన చూస్తుంటే రికార్డుస్థాయి మెజార్టీ ఖా యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం తో ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమాలతో ప్రజల గుండెల్లో నిలిచిన సీఎం కేసీఆర్ను ఆశీర్వదించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.