సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అనేక పథకాలతో లక్షలాది మంది లబ్ధిపొందుతున్నారు. ప్రధానంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు కింద ఇప్పటివరకు పదివిడతల్లో రూ. 3111.05 కోట్లు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమచేసింది. వివిధ కారణాలతో 5962మంది అన్నదాతలు చనిపోతే రూ.298.10 కోట్లు రైతుబీమా డబ్బులు ఇచ్చి వారి కుటుంబాలకు భరోసానిచ్చింది.
పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో 5920 డబుల్బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు 3318 పూర్తయ్యాయి. కల్యాణలక్ష్మి పథకం కింద 36,500 మందికి రూ.365.42 కోట్లు, షాదీముబారక్ ద్వారా 9637 మందికి రూ.96.48 కోట్లు ఆర్థిక సాయం అందజేసింది. మొదటి విడతో 444 మందిని దళితబంధుకు ఎంపిక చేసి సొంత వ్యాపారాలకు ప్రోత్సాహమిచ్చింది. మెదక్ జిల్లాలో ప్రతి నెలా రూ.28.84కోట్లను ఆసరా పింఛన్లు అకౌంట్లలో జమచేస్తున్నది. 2,67,69 మంది బాలింతలకు కేసీఆర్ కిట్ అందజేసి, 1,06,151 మందికి నగదు ప్రోత్సాహంగా రూ.31,56 కోట్లు పంపిణీ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుండడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
-సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 16
సంగారెడ్డి మార్చి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్బెడ్రూమ్, ఉచిత విద్యుత్, రుణమాఫీ, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు ప్రజలకు వరంలా మారాయి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు వర్తింపజేస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రైతులకు అండగా రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా..గొర్రెల పంపిణీ
సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలబడుతున్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లాలో 2108 నుంచి రైతుబంధు పథకం అమలు చేస్తుండగా, 2018 నుంచి 2023 వరకు పది విడతల్లో రూ. 3111.05 కోట్లు పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 2018 వానకాలంలో రూ.2,66,800 మంది రైతులకు రూ.280 కోట్లు, 2018-19 యాసంగిలో 2,45,445 మంది రైతులకు రూ.268 కోట్లు, 2019 వానకాలంలో 2,54,230 మందికి రూ.297 కోట్లు అందజేసింది. 2019-20 యాసంగిలో 2,12,167 మంది రైతులకు రూ.216 కోట్లు, 2020 వానకాలంలో 2,88,265 మంది రైతులకు రూ.366 కోట్లు, 2020-21 యాసంగిలో 2,94,330 రైతులకు రూ.368 కోట్లు, 2021 వానకాలంలో 3,02,644 మంది రైతులకు రూ.366 కోట్లు, 2021-22 యాసంగిలో 3,17,552 మంది రైతులకు రూ.370 కోట్లు రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేసింది. 2022 వానకాలంలో 3,36,560 మంది రైతులకు రూ.372 కోట్లు, 2022-23 యాసంగి సీజన్లో 3,24,640 మంది రైతులకు రూ.335 కోట్లు ఖాతాల్లో జమచేసింది.
ఈ పథకంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం ఆగిపోయింది. పంటల సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. దీంతో పాటు రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తోంది. జిల్లాలో 1,89,841 మందికి రుణమాఫీ వర్తింపజేసింది. మరోవైపు రైతుబీమా అన్నదాతలకు వరంగా మారింది. అకస్మాత్తుగా, ప్రమాదవశాత్తుగా మరణిస్తే ప్రభుత్వం రైతుబీమా కింద రూ.5 లక్షలు అందజేస్తోంది. జిల్లాలో 2,08,503 మందికి రైతుబీమా వర్తింపజేసింది. ఇప్పటి వరకు 5962 మంది రైతులు మృతిచెందగా వారి కుటుంబాలకు రూ.298.10 కోట్లు అందజేసింది. ఉచిత విద్యుత్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో లక్ష మందికిపైగా రైతులు లబ్ధిపొందుతుండగా, బోరుబావుల కింద సాగు విస్తీర్ణంతో పాటు వరి సాగు గణనీయంగా పెరిగింది. గొల్ల, కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి గొర్రెల పంపిణీ పథకం ద్వారా మొదటి విడత కింద 31,170 మంది లబ్ధిదారులకు 18,754 గొర్రెల యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమానికి పెద్దపీట.. దళితబంధుతో మారుతున్న జీవితాలు
దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లాలో మొదటి విడతగా 444 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజవర్గాల్లో వంద మంది చొప్పున దళితబంధు పథకాన్ని వర్తింపజేశారు. దళితబంధు కింద లబ్ధిదారులు మినీడెయిరీలు, వాణిజ్య వాహనాలు, జేసీబీలు, కంకర మిషన్లు, కిరాణా, బట్టల షాపులు, సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.. త్వరలో రెండవ విడత అమలు చేసేందుకు సర్కార్ చర్యలు వేగవంతం చేసింది. పోడుభూములు సాగు చేస్తున్న గిరిజనులకు భరోసా కల్పిస్తూ జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లోని 1127 మంది గిరిజనులకు 1808 ఎకరాల భూమిపై భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టదారు పాసుపుస్తకాలు అందజేయనున్నది.
ఎస్టీ వార్షిక ప్రణాళికలో ప్రతి ఏడాది 200 నుంచి 300 మంది గిరిజనులను ఎంపిక చేసి రూ.4 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తోంది. ఎస్సీ సంక్షేమ శాఖ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 37 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు రూ.7.50 కోట్లు అందజేసింది. కులాంతర వివాహాలు చేసుకున్న 56 జంటలకు ప్రోత్సాహంగా రూ.1.40 కోట్లు అందజేసింది. ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 100 మంది విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి, సీఎం స్కాలర్షిప్ అందిస్తూ విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. గీత కార్మికుల కోసం హరితహారం ద్వారా ఈత చెట్లు పెంచుతోంది. అలాగే, గౌడ సామాజిక వర్గానికి వైన్స్ దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలు చేస్తోంది. చేనేత కార్మికులకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీపై ముడిసరుకులను అందజేస్తోంది. బతుకమ్మ పండుగ కోసం ప్రతిఏటా 3.83 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది.
కల్యాణలక్ష్మితో పేదింట్లో పెళ్లి భాజాలు.. ఆసరాతో వృద్ధులకు అండ
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద ఇండ్లల్లో కల్యాణకాంతులు విరజిమ్ముతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 36,500 మందికి రూ.365.42 కోట్లు, షాదీముబారక్ కింద 9637 మందికి రూ.96.48 కోట్లు ఆర్థిక సాయం అందజేసింది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు మొత్తం 1.62 లక్షల మందికి ప్రతినెలా రూ.36 కోట్ల ఆసరా పింఛన్ డబ్బులను ప్రభుత్వం అకౌంట్లలో జమచేస్తోంది.
నెరవేరుతున్న సొంతింటి కల
డబుల్బెడ్రూమ్ పథకంతో పేదల సొం తింటికల నెరవేరుతోంది. ప్రభుత్వం రూ. 338. 11 కోట్లతో 5920 డబుల్బెడ్రూ మ్ ఇండ్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రూ.210 కోట్లతో జిల్లాలో 3318 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో 2102 డబు ల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవలే, జహీరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇండ్లు అందజేశారు. తాజాగా, గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. ఖాళీ స్థలాలు ఉన్నవాళ్లు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నది.
కేసీఆర్ కిట్, కంటి వెలుగు
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్ను ప్రభుత్వం అందజేస్తున్నది. మెదక్ జిల్లాలో ఏటా 25వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ఆడపిల్ల జన్మిస్తే రూ.13వేలు, మగశిశువుకు రూ.12వేల నగదును ఖాతాల్లో జమ చేస్తోంది. కాగా, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయాలనే ఉద్దేశంతో వచ్చేనెల నుంచి న్యూట్రీషన్ కిట్లు పంపిణీ చేయనున్నది. కంటి సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఉచితంగా పరీక్షలు చేసి మందులు, అద్దాలు అందజేస్తోంది. మొదటి విడుత విజయవంతం అవడంతో ఇటీవలే రెండవ విడతను ప్రారంభించింది. ప్రజలు పెద్ద ఎత్తున శిబిరాలకు తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 29,769 మంది లబ్ధిదారులకు కేసీఆర్ కిట్ ఇవ్వడంతో పాటు మగశిశువు, ఆడ శిశువు జన్మిస్తే నగదు ప్రోత్సాహంగా 1,06,151 మందికి రూ.31,56 కోట్లు పంపిణీ చేసింది.
4,790 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
గూడు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి సొంతింటి కలను సాకారం చేసేలా డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా, జిల్లాకు 4,790 డబుల్ బెడ్రూమ్లు మంజూరయ్యాయి.
ప్రతి ఇంటికీ సంక్షేమం
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 16: పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నది. డబుల్ బెడ్ రూమ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, దళితులకు భూ పంపిణీ తదితర పథకాలను అందిస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారాడు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని కేంద్రంతో పాటు ఇతర రాష్ర్టాలూ ఇక్కడి కార్యక్రమాలను తమ వద్ద అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మెదక్ జిల్లాలో వివిధ పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధిపొందుతున్నారు.
1,17,704 మంది ఆసరా లబ్ధిదారులు..
సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు వృద్ధులకు ఎంతో ఆసరా అవుతున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు పింఛన్ రూ.200 ఇస్తుండగా, ప్రసుత్తం రూ.2016 ఇస్తున్నది. దివ్వాంగులకు రూ.3016కు పెంచింది. మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్లు 40,372, వితంతు 46,5 36, దివ్యాంగుల 8,682, ఒంటరి మహిళలు 4,290, బీడి కార్మికులు 15,827, గీత కార్మికులు 934, చేనేత కార్మికులు 490, పైలేరియా 485, డయాలసిస్ పింఛన్లు 88 ఉన్నాయి. మొత్తం 1,17,704 మందికి ప్రతినెలా రూ.28.84కోట్లు ప్రభుత్వం అందజేస్తోంది.
పెట్టుబడి సాయం..
రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు బంధు కింద జిల్లాలోని 2,36,234 మంది రైతుల ఖాతాల్లో 2022-23 సంవత్సరానికి రూ.181.36 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.
రైతుబీమా..
రైతుబీమా ద్వారా 1,62,409 మంది రైతులకు రైతుబీమా కల్పించగా, ఇప్పటి వరకు జిల్లాలో 459 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.21.95 కోట్లు ప్రభుత్వం అందజేసింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో..
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా 3,255 మంది, షాదీముబారక్ ద్వారా 185 మంది లబ్ధిపొందారు. మొత్తం రూ. 34.33 కోట్ల నగదు వారి అకౌంట్లలో జమ అయ్యాయి.
దళిత బంధు పథకం
దళిథ బంధు పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 256 మంది లబ్ధి పొందారు. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం 25.50 కోట్లు అందజేసింది.
రుణమాఫీ చేసి ఇబ్బందులు తీర్చిండ్రు
నేను కంగ్టి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో కొన్నేండ్ల కింద వ్యవసాయరుణాన్ని తీసుకున్నాను. సీఎం కేసీఆర్ గత మూడేండ్ల క్రితం నేను తీసుకున్న రుణాన్ని మాఫీ చేశారు. దీంతో నేను బ్యాంకులో కట్టవలసిన రుణం కట్టలేదు. మరోమారు వ్యవసాయ రుణాన్ని తీసుకున్నాను. రుణమాఫీతో నాఇబ్బందులు తీరినయ్. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
-వైద్యనాథ్, చౌకన్పల్లి, కంగ్టి కేసీఆర్ కిట్లతో పాటు, ఆర్థిక సహాయం
నా కంటి చూపు బాగైంది..
నా కంటి చూపు బాగైంది. ప్రభుత్వం ఇచ్చిన కంటి అద్దాలతో అంతా చూడగలుగున్నాను. గతం లో కూడా నేను కంటి వెలుగులోనే పరీక్షలు చేపిస్తే కంటి అద్దాలు ఇచ్చారు. దగ్గరి వస్తువులు కనిపించేవి కావు. అప్పుడు ఇచ్చిన అద్దాలతో దగ్గర వస్తువులు చూస్తున్నా. ఇప్పుడు కూడా పాయింట్ పెరిగిందని కొత్త అద్దాలు ఇచ్చారు. కండ్ల సమస్య బాగా సతాయించే మాలాంటి వాళ్లకు ఉచిత పరీక్షలు లాభమే. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
-కుమ్మరి మాణయ్య, ఇంద్రేశం గ్రామం, పటాన్చెరు మండలం