సిద్దిపేట, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్రావు వరుసగా ఏడోసారి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ శాసన సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మూడోసారి ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు 45,283 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి వరుసగా మూడో సారి గెలుపొందడం రికార్డుగా చెప్పవచ్చు. ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి ఏ ఎమ్మెల్యే అయినా వరుసగా మూడుసార్లు గెలిచిన సందర్భాలు లేవు. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 19,391 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డిపై సీఎం కేసీఆర్ 58,290 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సిద్దిపేట శాసనసభ స్థానం నుంచి వరుసగా ఏడోసారి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఘన విజయం సాధించారు. మరోసారి ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ ఎన్నికల్లో 83,025 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దేశ చరిత్రలోనే ఒకే శాసనసభ స్థానం నుంచి వరుసగా ఏడోసారి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడం రికార్డుగా చెప్పవచ్చు. ఈ అరుదైన రికార్డును మంత్రి హరీశ్రావు సొంతం చేసుకున్నారు. నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం రాత్రింబవళ్లు పనిచేసే నాయకుడికి నియోజకవర్గ ప్రజలు మెజార్టీ ఇచ్చి పట్టం కట్టారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా భావించిన నియోజకవర్గ ప్రజలు మంత్రి హరీశ్రావును అక్కున చేర్చుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2004 అక్టోబర్లో మొదటి సారి సిద్దిపేట శాసన సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికలో తన సమీప టీడీపీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి పై 24,827 ఓట్ల మెజార్టీతో హరీశ్రావు గెలుపొందారు. అప్పటి నుంచి విజయాలతో దూసుకెళ్తున్నారు. తర్వాత ప్రతి ఎన్నికల్లో తన మెజార్టీని తానే అధిగమిస్తూ ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తూ తిరుగులేని నేతగా ఎదిగారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందగా, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీ సాధించి తన రికార్డును తానే తిరగరాశారు. 2010లో మరోసారి జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లు, 2014లో 93,328 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018 సాధారణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీతో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఏడోసారి ఘనవిజయం సాధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.