సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట/ సిద్దిపేట రూరల్ ,అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : ‘జననీ జన్మభూమిచ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. ఈ మాట అన్నది సాక్షాత్తూ భగవంతుడైన శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు.. స్వర్గం కంటే కూడా నా జన్మభూమి గొప్పది. సిద్దిపేట పేరు విన్నా, సిద్దిపేటకు వచ్చినా.. సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాకింది, నన్ను పెద్దగా చేసింది, నాకు చదువు చెప్పింది, నాకు రాజకీయ జన్మనిచ్చింది, నన్ను నాయకున్ని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని గర్వంగా చెబుతున్న’..అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో నిర్వహించిన ‘ప్రగతి ప్రజాఆశీర్వాద సభ’కు వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా, యావత్ దేశమే ఆశ్చర్యపడే విధంగా అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిపి ముందుకు తీసుకెళ్తున్నానంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధ్ది, బలం అన్ని ఈ గడ్డ పుణ్యమే అని అన్నారు. నన్ను ఇంత వాడిని చేసిన నా మాతృభూమికి, నా కన్నతల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, నన్ను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో నేను ఏమిచ్చినా తీర్చుకోలేనని పేర్కొన్నారు. నాతో కలిసి పనిచేసిన మిత్రులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారన్నారు. ఎంతోమంది ఆత్మీ య మిత్రులు కొండంరాజుపల్లి మాదన్న, మా నావబ్ సాబ్, నాకు డిపాజిక్ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ, ఇంకా ప్రతి గ్రామంలో వంద నుంచి రెండు వందల మంది పేర్లు పెట్టే పిలిచేంత అభిమానం కలిగిన గడ్డ ఈ సిద్దిపేట గడ్డ అని అన్నారు. సిద్దిపేట పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో మంచి నీళ్ల కరువు వస్తే.. వార్డుకు ఒక ట్యాంకర్ చొప్పున ఏర్పాటు చేసి, నాలుగు బోర్లు బండ్లు తీసుకొని ఉదయం 5.30 గంటలకు బయల్దేరి సాయంత్రం దాకా వంద బోర్లు వేశామన్నారు. కేవలం 200 బోర్లల్లనే కొంత నీరు వచ్చిందన్నారు. మంచినీళ్ల కోసం నాడు సిద్దిపేట చాలా గోసపడ్డది. ఆనాడే లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి జల జాతర చేసుకున్నామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
నాడు కరీంగనర్ ఎంపీగా గెలిచిన నాడు ఢిల్లీకి పోయేందుకు సిద్దిపేటలో మీటింగ్ పెట్టి అందరం ఏడ్చినం. అనంతరం సిద్దిపేటకు ఆరడుగుల బుల్లెట్ను మీకు అప్పగించిన. బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు హరీశ్రావు పనిచేసి మీ గౌరవాన్ని నిలబెట్టిండని సీఎం కేసీఆర్ అన్నారు. మంత్రిగా అయినప్పటి నుంచి నేటి దాకా ప్రతి విషయంలో ఈ ప్రాంతానికి అద్భుతమైన కృషి హరీశ్రావు చేశాడన్నారు.
హరీశ్రావు స్థానంలో నేను ఉన్నా ఇంత అభివృద్ధి చేసేవాన్ని కాదేమో అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటకు నీళ్లు, రైలు, గోదావరి నీళ్లు వచ్చాయన్నారు. సిద్దిపేటకు రానిది, లేనిది ఏదీ లేదన్నారు. ఒకనాడు కన్నీరు కార్చిన సిద్దిపేటలో నేడు చెక్డ్యామ్లు పన్నీరు కారినట్టుగా మత్తళ్లు దూకుతుంటే ఫొటోలు చూసుకుంటూ సంతోషపడుతున్నానన్నారు. ఎప్పుడు హెలిక్యాప్టర్లో పోతుంటే నిండిన చెక్డ్యామ్లు చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేటకు ఒక్కటే తక్కువైంది, అది గాలిమోటర్ అని అన్నారు. మంచినీళ్లు, సాగు నీళ్లు, అధికారం, గౌరవం, మెడికల్ కళాశాల, మినీ యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఇలా అన్నీ వచ్చాయన్నారు. సిద్దిపేటకు మంత్రి హరీశ్రావు ఐటీ హబ్ కూడా తెచ్చాడు. రాబోయో రోజుల్లో సిద్దిపేట ఒక వజ్రపు తునకలా మారిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత చూపి ఒక లక్ష మెజార్జీ ఇచ్చారు. హరీశ్రావు పనితనం, సిద్దిపేట పటుత్వం చూసి మరొక్క సారి మరింత భారీ మెజార్టీతో హరీశ్రావును గెలిపించాలి. దళితబంధుకు ప్రేరణ రామంచ గ్రామం. దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని.. దిక్కుమాలిన కాంగ్రెస్ హయాంలో ఏనాడు దళితుల కోసం పని చేయలేదు కనుకనే నాడు సిద్దిపేటలో కలిగిన చాలా అనుభవాలను తీసుకొని దళితబంధు పథకాన్ని రూపొందించాం. క్రమక్రమంగా తెలంగాణలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళితబంధు అందే వరకు రాజీపడం. అదే విధంగా బీసీల్లో ఉన్న వృత్తి కులాల వారికి ఆర్థిక సాయం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరూ అపోహ పడొద్దు. నాడు చాలా గ్రామాలు తిరిగి అనేక పనులు చేశాం. నేడు తెలంగాణ భారతదేశానికే తలమానికం అయితే.. సిద్దిపేట నియోజకవర్గం తెలంగాణకే తలమానికంగా ఉండేలా హరీశ్రావు నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. వర్తక, వ్యాపార వాణిజ్య కేంద్రం, ఐటీ కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా, పరిశ్రమల కేంద్రంగా సిద్దిపేట ఎదగడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి హరీశ్రావును దీవించి, మీ మెజార్టీని మీరే తిరగరాయాలి.
నేడు తీసుకొచ్చిన దళితబంధకు ప్రేరణ సిద్దిపేటనే అని సీఎం కేసీఆర్ తెలిపారు. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన ఓ దళిత ఆడబిడ్డ తన ఇంటి వచ్చిందని.. ఏమైందని అడిగితే తన బిడ్డ పెండ్లి ఎత్తిపోతుందని చెప్పిందన్నారు. ఎందుకంటే సైకిల్ కట్నంగా పెడతామని ఒప్పుకున్నామని.. తన వద్ద సైకిల్కు డబ్బులు లేవని చెప్పిందన్నారు. అయితే అప్పుడు తాను సైకిల్ కొనడం కోసం రూ.1900 ఇచ్చి నియోజకవర్గానికి బయల్దేరానని చెప్పారు. మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉందని.. ఎందుకని అడిగితే తాను కొబ్బరికాయ కొట్టాలని కోరిందన్నారు. అప్పుడు తన అల్లున్ని ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే తన తండ్రి బలవంతం వల్లనే ఇలా చేస్తున్నానని చెప్పగా.. సరే అని సైకిల్ కొనిచ్చానని చెప్పారు. అల్లుడు, బిడ్డ, అత్త ముగ్గురు సైకిల్ మీద పోతుంటే చాలా బాగా అనిపిచ్చిందని చెప్పగానే సభలో నవ్వులు విరిశాయి. నాటి అనుభవాలు, గుణపాఠాలు నేటి దళితబంధుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ మాట్లాడినంత సేపు సిద్దిపేటతో తనకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో తాను తిరిగిన గ్రామాలు, తిరిగిన మనుషులను మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు. తనకు ఎంతో ఆత్మీయ మిత్రులు ఉన్నారని.. కొండంరాజుపల్లి మాదన్న, మా నావబ్ సాబ్, నాకు డిపాజిక్ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బా వ అంటూ వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరిగిన నంగునూరు మండలం గట్లమల్యాల, కోనాయపల్లి,కొండంరాజుపల్లి, రామునిపట్ల, మగ్దూంపూర్, నంగునూరు పెద్దవాగు ఇలా గ్రామాలను గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో వంద నుంచి మూ డు వందల మంది వరకు పేర్లు పెట్టే పిలిచేంత అభిమానం కలిగిన గడ్డ సిద్దిపేట గడ్డ అన్నారు.
నేటి మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతుంటే అది నాటి సిద్దిపేట మంచినీళ్ల పథకమే పునాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చింతమడకలో చిన్ననాట మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకుంటే ముదిరాజ్ తల్లి నాకు చనువాలు ఇచ్చి సాకిందన్నారు. అంతటి సంబంధం ఈ గడ్డతోని ఉంది. నేను పాదయాత్ర చేయని గ్రామం లేదు, తిరగని గ్రామం, చూడని కుంట, చెరువు, తిరగని రోడ్డు లేదు. చాలా కష్టపడి ఒక దరికి తెచ్చాం. కానీ నాడు తాగు, తాగునీళ్లు లేని సిద్దిపేట, బంగారం లాంటి భూమలు ఉన్నా, పంటలు పండలేని సిద్దిపేటగా ఉండేదన్నారు. అధికార పార్టీని వదిలిపెట్టి, తెలంగాణ తల్లికి విముక్తి చేయాలని మొండి పట్టుదలతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే తనను ఆశీర్వదించారన్నారు. ఉప ఎన్నికల్లో తనకు బస్సు గుర్తు వస్తే.. యావత్ సమైక్య వాదులు సిద్దిపేటకు వచ్చి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టినా.. తిప్పికొట్టి 60 వేల మెజార్టీ ఇచ్చి నాకు విజయం అందించి పంపారన్నారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డనే అని మర్చిపోలేదన్నారు. కరీంనగర్, మహబూబ్నగర్ ఎంపీగా పోయినా, గజ్వేల్ ఎమ్మెల్యేగా, ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యేగా పోయినా.. కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టే వెళ్తా అని మీ అందరికీ తెలుసన్నారు. అంతటి పెనువేసుకున్న అనుబంధం మనది. దాదాపు 50 ఏండ్లు కలిసి బతికిన బతుకులు మనవన్నారు.
సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, బాలమల్లు, శ్రీదేవీచందర్రావు, జడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, కుంభాల లక్ష్మీరాఘవారెడ్డి, ఉమా వెంకట్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, బాలకిషన్రావు, మడుపు భూంరెడ్డి, శ్రీనివాస్రావు, వేముల వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, నాయకులు పూజల వెంకటేశ్వర్రావు, పెద్ది సుధాకర్, దువ్వల మల్లయ్య, బీఆర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షుడు రజనికాంత్రెడ్డి, మరుపల్లి శ్రీనివాస్గౌడ్, లక్ష్మీరాజం, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.