సంగారెడ్డి అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువచేశారు. ఫలితంగా పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందటంతోపాటు అభివృద్ధి ఊపందుకుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు ప్రజాసమస్యలు సత్వరం పరిష్కారం అయ్యాయి. ఉమ్మడి ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఫలాలు అందాలంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు పాలన చేరువైంది.
ఇందుకోసం కొత్త జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీలు, పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అధికార వికేంద్రీకరణకు, పాలనలో పారదర్శకతకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి, అక్రమాలు,దళారీ వ్యవస్థకు తావులేకుండా చేశారు. కలెక్టర్, ఎస్పీ సహా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సంగారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లా మనుగడలోకి వచ్చింది. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలతో కలిసి జిల్లా ఏర్పాటైంది. దీంతో కలెక్టర్, జిల్లా అధికారులు మారుమూల ప్రాంతా ల్లో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయగలిగారు. సంగారెడ్డిలో నీటిపారుదదల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రహదారుల భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం సంగారెడ్డిలో ఏర్పాటైంది. సంగారెడ్డిలో కొత్తగా పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయం ఏర్పాటు చేశారు. రాయికోడ్, పటాన్చెరులో ఏడీఏ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఆర్ఆండ్బీ, పంచాయతీరాజ్లో ఈఈ, డీఈ పోస్టులను పెంచింది.
పంచాయతీలుగా మారిన తండాలు
కొత్త పంచాయతీల ఏర్పాటుతో తండాలు కాస్త పంచాయతీలుగా మారాయి. జిల్లాలో 2014లో 457 పంచాయతీలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 647కు చేరుకుంది. కొత్తగా 190 పంచాయతీలు ఏర్పడ్డాయి. అందోలు నియోజకవర్గంలో 29, నారాయణఖేడ్లో 88, పటాన్చెరులో 13, సంగారెడ్డిలో 14, జహీరాబాద్లో 31, హత్నూర మండలంలో 15 జీపీలు ఏర్పాటయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 79 తండాలు పంచాయతీలుగా మారాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 48 తండాలు పంచాయతీలు మారాయి. జిల్లాలో కొత్తగా ఐదు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. నగర పంచాయతీగా ఉన్న జోగిపేట-అందోల్ను కేసీఆర్ ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. కొత్తగా అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్, నారాయణఖేడ్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. ఫలితంగా పట్టణాల్లో అభివృద్ది ఊపందుకుంది.
సమస్యల పరిష్కారం సులభమైంది
నారాయణఖేడ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో ప్రజల సమస్యల పరిష్కారం సులభమైంది. గతంలో ఆర్డీవో స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వచ్చేది. నారాయణఖేడ్లో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటైన తర్వాత ప్రజల ఇబ్బందులు దూరమయ్యాయి. నారాయణఖేడ్ స్థాయి కూడా పెరిగింది.
– లక్ష్మణ్రావు, న్యాయవాది, నారాయణఖేడ్
కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు
సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ప్రభుత్వం మూడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరినా పాలకులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న తలంపుతో కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటుకు ప్రజల డిమాండ్కు అనుగుణంగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో కొత్తగా పది మండలాలను ఏర్పాటు చేశారు. కంది, గుమ్మడిదల, అమీన్పూర్, మొగుడంపల్లి, చౌటకూరు, నాగల్గిద్ద, వట్పల్లి, సిర్గాపూర్, నిజాంపేట, తడ్కల్ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త మండలాల్లో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేయటంతోపాటు అసవరమైన సిబ్బందిని నియమించింది. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుతో భూముల రిజిస్ట్రేషన్లతోపాటు భూ సమస్యల పరిష్కారం సులభతరం అయ్యింది.
చిన్నమండలంతో సుపరిపాలన
దశాబ్దాలుగాతడ్కల్ను మండలకేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను వేడుకున్నాం ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం మండలముగా ప్రకటించి, నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇది ఎంతో శుభపరిణామం. దీంతో తడ్కల్లోనే మండలస్థాయి కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. అధికారుల కోసం కంగ్టికి వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆసమస్య తీరిందని చెప్పుకోవచ్చు. తడ్కల్ను మండలంగా ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్లకు కృతజ్ఞతలు.
ముప్పిడి విఠల్, ప్రముఖ చిత్రకారుడు, తడ్కల్, కంగ్టి