సమైక్య పాలనలో చెరువులు వట్టిపోగా.. నేడు స్వయం పాలనలో తటాకాలు నిండుకుండలా మారి చేపలతో కళకళలాడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సిద్దిపేటలోని చింతలచెరువులో ఆదివారం 52 వేల చేప పిల్లలను వదిలారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని 7200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ కింద చెరువులను బాగుచేయించడంతో వాటి రూపురేఖలు మారినట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా వందశాతం సబ్సిడీతో చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదులుతుండడంతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతున్నట్లు చెప్పారు. గతంలో పక్క రాష్ర్టాల నుంచి చేపలు వస్తే తప్పా తెలంగాణలో దొరికేవి కాదని, నేడు పుష్కలంగా లభిస్తున్నట్లు చెప్పారు. ఇవ్వాళ మొగులుకు ముఖాన్ని పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. కాలం కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, చెక్డ్యామ్లు నింపామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. మన కోసం ఆలోచన చేసే ప్రభుత్వాన్ని అన్ని విధాలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
– సిద్దిపేట, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా గుర్తింపు కార్డులు సిద్దిపేటలో ప్రారంభం కావడం చాలా సంతోషం. మత్స్యకారులు నా వద్దకు వచ్చి రాత్రి పగలు తిరుగుతాం. గుర్తింపు కార్డు ఉంటే బీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. వారి కోరిక మేరకు ఒక సిద్దిపేటకే కాదు.. రాష్ట్రమంతా ఐడెంటీ కార్డులు ఇస్తామని చెప్పి, ఇవాళ సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోనే 8వేల మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని” ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని యాదవ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ ,మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యానాయక్, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మత్స్య సహకార సంఘం ఫెడరేషన్ చైర్మన్ డీటీ మల్లయ్యతో కలిసి చింతల చెరువులో 52 వేల చేపపిల్లలను వదిలారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని 7200 మంది మత్స్యకారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మత్స్యకారులకు గొప్ప అవకాశం ఇచ్చారన్నారు. రూ. 1000 కోట్లు ఇచ్చి మోపెడ్లు, ఐస్ బాక్సులు, వలలు, బోట్లు వివిధ కార్యక్రమాలు చేశారన్నారు. ప్రతి సంవత్సరం 100-110 కోట్లతో ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం ద్వారా దాని మీద వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అంటే మత్స్యకారులకు 2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా సంక్షేమం కోసం ఖర్చు పెడుతుందన్నారు.గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమమే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి 4-5 చెరువులకు ఇచ్చేవాళ్లన్నారు.అది కూడా సబ్సిడీ ఏదో చారనమందం మేమిస్తం.. బారాన మీరు పెట్టుకోండని చెప్పే పరిస్థితి ఉండేదన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి చెరువు, కుంట, వాగులు, చెక్డ్యామ్, ప్రాజెక్టుల్లో ఉచితంగా చేప, రొయ్య పిల్లలు వదిలామంటే ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
మృగశిర కార్తె వస్తే విజయవాడ నుంచి లారీలు రావాలి. మృగశిర కార్తెనాడు అందరూ చేపలు తినాలని సంప్రదాయం. కానీ చేపలు లేక బెంగాల్, విజయవాడ, విశాఖ పట్టణం నుంచి లారీల్లో చేపలు వస్తే మనం ఆ రోజు కిలోకి రూ.500 నుంచి రూ.1000 పెట్టి కొనుక్కొని తినే పరిస్థితి ఉండేదన్నారు. పక్క రాష్ర్టాల నుంచి చేపలు వస్తే తప్పా తెలంగాణలో చేపలు దొరకని పరిస్థితి ఉండేదన్నారు. ఇవాళ సీన్ రివర్స్ అయింది. సీఎం కేసీఆర్ మొట్టమొదటి సారి చేసిన కార్యక్రమం మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేశారన్నారు. ఆరోజుల్లో నీరు లేక చెరువుల్లో చేపలు ఉండేవి కావు. కానీ మిషన్ కాకతీయతో ఇవాళ నీళ్లకు కరువు లేదు.. చేపలకు కరువు లేదన్నారు. ఇవాళ కాలంతో పనిలేదు. ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాలం కాకపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, చెక్డ్యామ్లు నింపామని, సంవత్సమంతా నీళ్లే నీళ్లు అని అన్నారు.
రాజగోపాల్పేట చెరువు కథ
గత ప్రభుత్వాల్లో చెరువుల దుస్థితి ఎలా ఉండేనో మంత్రి హరీశ్రావు వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నా. ఒక రోజు రాజగోపాల్పేట బెస్తవారు టాక్టర్లో నా వద్దకు వచ్చారు. 2007 -08లో కరువు వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ చేపలు పోసుడు లేదు. వాళ్లందరూ టాక్టర్లో వస్తే అడిగా. మేం విజయవాడకు పోయి కొర్రమట్టలు, బొచ్చలు తెచ్చి లక్షన్నర, రెండు లక్షలు పెట్టి చాపలు పోసినం. కాలం కాలేదు.. కొద్దిగా నీళ్లున్నయి. గుంజుకుపోతున్నాయి సాయం చేయాలన్నారు. బోర్లు ఏపిచ్చి.. కరెంట్ స్తంభాలు పెట్టి ప్రయత్నం చేసినం. ఇంత చేస్తే నెల వరకు బోర్లు బంద్ అయినయ్. నీళ్లు గుంజుకుపోయినయ్.. చేపలు కూడా పోయినయ్. పెట్టుబడి కూడా రాలే. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదీ పరిస్థితి ఉండే.. సిద్దిపేట నియోజకవర్గంలో రాజగోపాల్పేట చెరువు నిండిందంటే చుట్టుపక్కల 20 ఊర్లకు కరువు ఉండదని చెబుతారు. అటువంటి చెరువులో చుక్క నీళ్లు లేక బోరు వేసుకొని చేపలు కాపాడుకునే పరిస్థితి చూసినం.
ఇది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి.. మొన్న కూడా మళ్లీ అందరూ వచ్చిన్రు పోయిన ఏడాది. మళ్లీ వచ్చారని అడిగా.. ఏందీ సార్ కాళేశ్వరం ప్రాజెక్టు జేయంగ ఆ చెరువు ఎప్పుడు నిండే ఉంటుంది. చేపలు పడుదామంటే నిండ నీళ్లే ఉంటున్నయి. చేపలు పట్టాలంటే తూము లావట్టాలే అంటరు..అంటే ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయే సార్ అని అన్నారు. ఆనాడు నీళ్లు లేవు బోర్లు వేయమన్నరు. ఇప్పుడు నీళ్లు ఎక్కువైనయి. తూమ్ ఓపెన్ చేసి నీళ్లు ఎల్లగొట్టుమంటున్నరు. అంటే ఇది ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచించాలి. నాడేమో నీళ్లు లేని చేపల కరువు.. నేడేమో నీళ్లు ఫుల్.. చేపలు ఫుల్.. నీళ్లకు కరువు లేదు.. చేపలకు కరువు లేదు. ఎంత గొప్ప సంపద పెరిగిందో ఆలోచించాలే. పనులు చేయకుండనే అయితదా.. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేశారు.. ప్రాజెక్టులు కట్టాడు.. ప్రాజెక్టులను చెరువులు, వాగులకు అనుసంధానం చేయడం వల్ల ఇంత గొప్ప సంపద ఇవాళ తెలంగాణలో పెరిగిందని మంత్రి హరీశ్రావు అన్నారు.
కులవృత్తులపై ఆధారపడినవారి జీవితాల్లో వెలుగులు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కులవృత్తుల మీద ఆధారపడినవవారిజీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో చాలా గొప్ప కార్యక్రమాలు సీఎం కేసీఆర్ చేశారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేసిన ఇంకా ఏమో కావాలి. కానీ ఈ రోజు సిద్దిపేటలో మీరంతా అదృష్టవంతులు.. మన మంత్రి హరీశ్రావు ఇక్కడ ఉండడమే ఎంతో అదృష్టం. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో పనులు సిద్దిపేటలో జరుగుతున్నాయన్నారు. ఏ ఒక్కటి మిగలదు. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే సిద్దిపేటకే రావాలన్నారు.అంత అదృష్టవంతులు మీరు..ఒకప్పుడు సిద్దిపేట పరిస్థితిని మనం చూసినం. తాను చాలా సందర్భాల్లో వచ్చానన్నారు. సిద్దిపేట రోడ్డుకు ఎంట్రీ అవుతుంటే.. సిద్దిపేట నుంచి వేరే దేశాలకు వెళ్లినమో అనే ఫీలింగ్ కలుగుతుందన్నారు. సిద్దిపేట చాలా బాగుంది.. పదేండ్ల కింద భూమికి ఉన్న రేటేంది.. ఈ రోజు ఉన్న రేటేంది.. హైదరాబాద్లో ఏ రేటు ఉందో.. సిద్దిపేట దగ్గర కూడా ఆ రేటే ఉందన్నారు.
అంటే దీని వెనుక ఉన్నదేంటంటే ఒక కమిట్మెంట్, కృషి, పట్టుదల.. నా ప్రజలు సంతోషంగా ఉండాలన్నదేనన్నారు. మన కోసం ఆలోచన చేసే ప్రభుత్వాన్ని మనం అన్ని విధాలా ముందుకు తీసుకుపోవాలన్నారు.దుబ్బాక మత్స్యకారులంతా కొత్త ప్రభాకర్రెడ్డికి సహకారం అందించాలన్నారు. సీఎం కేసీఆర్ మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. 18 ఏండ్లు నిండిన వారికి సొసైటీలో సభ్యుత్వం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. మంత్రి హరీశ్రావు నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ వస్తుంది. తాగు, సాగునీరు సరఫరాతో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. గ్రామాలు పచ్చబడ్డాయి.. వరిధాన్యం, మత్స్య సంపద పెరిగిందన్నారు. జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజితావేణుగోపాల్రెడ్డి వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యపారిశ్రామిక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే కుల వృత్తులకు జీవం
తెలంగాణలోని కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం చేస్తూ కుల వృత్తులకు జీవం పోస్తున్నారు. మత్స్యకారులకు ఉచితంగా ప్రతి సంవత్సరం చేప పిల్లలను అందిస్తున్నారు. నేడు గుర్తింపు కార్డులు అందజేయడం సంతోషకరం. మత్స్యకారులను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి.
– కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. నేడు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో పాటు వారికి గుర్తింపు కార్డులు అందజేయడం సంతోషకరం. మత్స్యకారులకు వలలు, మోపెడ్లు, ఇతర పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. చెరువుల్లో చేపపిల్లలు ఉచితంగా వేయడంతోపాటు మత్స్యకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నది.
-రోజాశర్మ, జడ్పీ చైర్పర్సన్ సిద్దిపేట జిల్లా
సీఎం కేసీఆర్ అండగా నిలిచారు
30 ఏండ్ల నుంచి సంఘంలో సభ్యులుగా ఉన్నాం. గతంలో మాకు ఏ ప్రభుత్వం అండగా ఉండలేదు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. చేప పిల్లలను ఉచితంగా అందజేయడంతో పాటు నేడు మమ్ముల్ని గుర్తించి ఐడెంటీ కార్డులు అందజేయడం సంతోషంగా ఉన్నది.
-ఎర్వ రాజేందర్, మత్స్యకారుడు,పుల్లూరు
గుర్తింపు కార్డు ఇవ్వడం సంతోషం
గతంలో ప్రభుత్వాలు మమ్ముల్ని గుర్తించలేదు. కానీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు మమ్ముల్ని గుర్తించి మాకు గుర్తింపుకార్డులు ఇవ్వడం సంతోషం. వలలు, మోపెడ్లు అందించారు. కుల వృత్తులు చేసుకునేవారికి ప్రభుత్వం అండగా నిలిచింది. మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం.
-బి. కనకయ్య, మత్స్యకారుడు