మరో మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల దృష్ట్యా సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు బీఆర్ఎస్కు కంచుకోటగా నిలుస్తున్నాయి. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ నిలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించేందుకు అభ్యర్థులను ఖరారు చేయడంతో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలో ఎన్నికల సందడి మొదలైంది. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జిల్లాలో వార్వన్సైడే అని జిల్లా ప్రజలు ముక్త కంఠంతో జేజేలు పలుకుతున్నారు.
హ్యాట్రిక్పై గురి గజ్వేల్ నుంచి బరిలో సీఎం కేసీఆర్
సిద్దిపేట, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టనున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వరుసగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2014లో 19,391 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిపై విజయం సాధించగా, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58,290 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారు.
అభివృద్ధే అస్త్రం
సీఎం కేసీఆర్ 1983లో టీడీపీ తరపున సిద్దిపేట నియోజక వర్గం నుంచి పోటీ చేసి తన రాజకీయ గురువైన మదన్మోహన్ చేతిలో కేవలం 879 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం మధ్యంతర ఎన్నికల్లో 1985లో సిద్దిపేట శాసన సభ ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్రెడ్డిపై తొలిసారిగా విజయం సాధించారు. అప్పటి నుంచి సిద్దిపేటను తన కంచుకోటగా మలుచుకున్నారు. 1985లో టీడీపీ తరపున 16,156 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా 1989లో 13,816 ఓట్ల మెజార్టీ, 1994లో 27,107 ఓట్ల మెజార్టీ, 1999లో 27,555 ఓట్ల మెజార్టీతో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2001లో ఆర్ఎస్(బీఆర్ఎస్) స్థాపించిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 58,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తంమీద 7 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు మెదక్, కరీంనగర్, మహబూబ్నగర్ మూడు జిల్లాల నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. సిద్దిపేట నుంచి ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. గజ్వేల్ శాసన సభ్యుడిగా ఎన్నికై 2014 జూన్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వరుసగా రెండు సార్లు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. తొమ్మిదేండ్లలో దేశం అబ్బురపడేలా అభివృద్ధి చేసి చూపిన నేత సీఎం కేసీఆర్ది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ భారీ విజయం సొంతం చేసుకొని హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని సబ్బండ వర్గాల ప్రజలు చెబుతున్నారు.
సిద్దిపేట బరిలో మంత్రి హరీశ్రావు
సిద్దిపేట శాసనసభ స్థానం నుంచి వరుసగా ఏడోసారి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బరిలోకి దిగుతున్నారు. సిద్దిపేట నుంచి ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. 2018 ఎన్నికల్లో హరీశ్రావు 1,18,699 ఓట్ల మెజార్టీతో టీజేఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. తొలుత సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2004 అక్టోబర్లో సిద్దిపేట శాసన సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన సమీప టీడీపీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటినుంచి విజయాలతో దూసుకెళ్తున్నారు. తర్వాత ప్రతి ఎన్నికల్లో తన మెజార్టీని తానే అధిగమిస్తూ ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తూ తిరుగులేని నేతగా ఎదిగారు.
2008లో జరిగిన ఉప ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందగా, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీ సాధించి తన రికార్డును తానే తిరగరాశారు. 2010లో మరోసారి జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక రికార్డు మెజార్టీతో నంబర్ -1గా నిలిచారు. 2014లో 93,328 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందారు. గత సాధారణ ఎన్నికల్లో దేశ స్థాయిలోనే 1,18,699 ఓట్ల మెజార్టీతో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం రేయింబవళ్లు పనిచేసే నాయకునికి నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీని ఇచ్చి పట్టం కడుతున్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా భావించిన నియోజకవర్గ ప్రజలు మంత్రి హరీశ్రావును అక్కున చేర్చుకుంటున్నారు.
ముచ్చటగా మూడోసారి
పూర్వపు కరీంనగర్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మూడో సారి వొడితెల సతీశ్కుమార్ మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఈసారి భారీ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టనున్నారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 34,269 ఓట్లు, 2018 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిపై 70,530 ఓట్ల మెజార్టీతో వొడితెల సతీష్కుమార్ విజయ దుందుభి మోగించారు. ప్రతిసారి తన మెజార్టీని పెంచుకుంటూ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల సహకారంతో నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అందించడంతో అన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.