ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనంతో చిన్నారుల ఆకలి తీరుస్తుండగా, ఇక నుంచి ఉదయం వేళలో అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించను న్నారు. వారం రోజుల పాటు రోజుకోక టిఫిన్తో మెనూ సిద్ధం చేశారు. పంచాయతీరాజ్, డబ్ల్యూడీఅండ్సీడబ్ల్యూ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో దీనిని అమలు చేయనుండగా మెదక్ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల జడ్పీహెచ్ఎస్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే మదన్రెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రస్తుతానికి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో స్కూల్లో ప్రవేశపెట్టి దసరా సెలవుల తర్వాత నుంచి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.
– మెదక్ న్యూస్నెట్వర్క్,అక్టోబర్ 5
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 5: ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు చెప్పిన మాట ఎంత వాస్తవమో విద్యను నేర్చుకునే వారికి సరైన ఆహారం అందించడం కూడా అంతే వాస్తవం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు నిరుపేద కుటుంబాలవి. అలాంటి ఇండ్ల నుంచి సర్కారు బడికి వెళ్లే విద్యార్థులు ఉదయం పూట తినకుండానే వెళ్తుంటారు. సరైన భోజనం లేక విద్యార్థి ఆరోగ్యం కుంటుపడుతుంది. దీంతో చదువుపై అంత శ్రద్ధ వహించడం కష్టమే. ఈ పరిస్థితిని గ్రహించిన సీఎం కేసీఆర్ ప్రతి పేద విద్యార్థికి ఉదయం పూట అల్పాహారం అందించాలనే లక్ష్యంతో సీఎం అల్పాహారం పథకానికి శ్రీకారం చుట్టారు.
ఈ నెల 6న జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్లో ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్, టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ హాజరుకానున్నారు. ప్రతి మనిషికి విద్య, వైద్యం అనే కనీస సౌకర్యాలు ఎంతో ముఖ్యమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా పేదల చెంతకు చేరుతున్నాయన్నారు. విద్యతోనే జీవితాలు మారుతాయనే ఉదేశంతో ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. సర్కారు బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీఎం అల్పాహార పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టింది. దసరా సెలవుల తరువాత జిల్లాలోని 1272 ప్రభుత్వ పాఠశాల్లో ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 1272 ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సీఎం అల్పాహారంతో వారందరికీ లబ్ధి చేకూరనున్నది. జిల్లాలోని ఆయా యాజమాన్యాల వారీగా పాఠశాలలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పాఠశాల 1, కేంద్రీయ విద్యాలయాలు 2, కేజీబీవీ 17, మదర్సా అన్ రికగ్నైజ్డ్ 10, మినీ గురుకులం 1, మైనార్టీ వెల్ఫేర్ 12, మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలు 12, ఎంపీపీ, జడ్పిపీ పాఠశాలలు మొత్తం 1,220, ప్రైవేట్ ఎయిడెడ్ 5, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 431, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ (సీబీఎస్ఈ) 12, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ (ఐసీఎస్ఈ) 1, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 37, రాష్ట్ర ప్రభుత్వ (డీఎన్టీ) 5, టీఎస్ మోడల్ స్కూల్స్ 10, టీఎస్ సోషల్ వేల్ఫేర్ గురుకులాలు 11, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ 6, టీఎస్ఆర్ ఈఐ సొసైటీ స్కూల్స్ 2, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు 4, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి.
సోమవారం : ఇడ్లీ, సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం : పూరి, ఆలు కూర్మ లేదా రవ్వ, సాంబారుతో కూడిన టామాట బాత్
బుధవారం : ఉప్మా, సాంబారు లేదా రైస్ రవ్వ కిచిడి, చట్నీ
గురువారం : మిల్లెట్ ఇడ్లీ, సాంబారు లేదా పొంగల్, సాంబారు
శుక్రవారం : ఉగ్గాని, పోహా, మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడి, చట్నీ
శనివారం : పొంగల్, సాంబారు లేదా విజిటబుల్ పులావ, రైత, ఆలు కుర్మ
సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉదయం పిల్లలందరికీ అల్పాహారం పథకం ఒక బూస్ట్గా మారనున్నది. విద్యార్థులు సమయానికి తగిన ఆహారం తీసుకున్నప్పుడే విద్యలోనూ రాణిస్తారు. జిల్లాలో తొలుత 5 నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో నేడు ఈ పథకం ప్రారంభిస్తున్నాం. దసరా సెలవుల అనంతరం అన్ని పాఠశాలలో అమలుచేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు అందిస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి