దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థతతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
సంగారెడ్డి, జూలై 8: తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చెప్పిన మాటలు వట్టివేనని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, వ్యాగన్ ఫ్యాక్టరీతో సరిపెట్టడం సరికాదని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలోని నిబంధనలు మర్చిపోయిన బీజేపి సర్కారే అవినీతిలో కురుకుపోయిందన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీతో పాటు కొత్త రైల్వే లైన్కు నిధులు కేటాయిస్తామని మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. జిల్లాలోని వెలిమలలో ఈనెల 2న మేఘా సంస్థ యాజమాన్యం నిర్మించిన కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో ప్రధానికి కనువిప్పి కలిగిందన్నారు. అందుకే వరంగల్లో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి చేతులు దులుపుకొన్నారన్నారు.
దేశానికి ఆదర్శంగా ఎదుగుతున్న తెలంగాణపై మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మాటలు తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని, ఉద్యమ స్వభావంతో ప్రజల ఆకాంక్షలు నేరవేర్చని నాయకులకు తగినవిధంగా ప్రజలు బుద్ధి చెపుతారని చురకలంటించారు. రాష్ర్టానికి వచ్చి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పా అభివృద్ధిని నిధులు ఇవ్వడంలో సవతి తల్లి ప్రేమను ప్రధాని వలకబోస్తున్నారన్నారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మాట ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గొప్పతనంతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, ఇది చూసి బీజేపీ నాయకులు గర్వపడకుండా అడ్డుకోవడం విడ్డూరని విమర్శించారు. సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు ప్రధాని మోదీకి లేదని, తాటాకు చప్పుళ్లకు తెలంగాణలో భయపడేవారు లేరన్నారు.