సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లు ఆయన పదవిలో కొనసాగనున్నారు. చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు చింతా ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 12 : తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతా ప్రభాకర్ రెండేండ్లపాటు చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. చింతా ప్రభాకర్కు ఈ పదవి ఇవ్వడంతో జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతున్నది. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన చింతా ప్రభాకర్కు చేనేత, కార్మికుల గురించి అవగాహన ఉన్నది. సదాశివపేటకు చెందిన ప్రభాకర్ ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ నాయకుడిగా, కార్మికులకు అండగా నిలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదట సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా ఐదేండ్లపాటు కొనసాగారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు.
టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనను నియమించారు. జిల్లాలో చేనేత కార్మికులు, పద్మశాలీల సంక్షేమం కోసం పాటుపడుతున్న చింతా ప్రభాకర్కు సీఎం కేసీఆర్ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తనను కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాకర్కు జిల్లాలోని ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బి.విజయలక్ష్మీరవి, వైస్ చైర్మన్ లతా విజయేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు మల్లేశం, ప్రదీప్, జలందర్, శ్రవణ్రెడ్డి, మసూద్, చింటూ ఉన్నారు.