మెదక్ రూరల్, రామాయంపేట, చిన్నశంకరంపేట, న్యాల్కల్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): మనం నిర్వహించుకునే ప్రతి పండుగ ప్రత్యేకమే. సాధారణ పర్వదినాల నుంచి మొదలుకొని రాష్ట్ర, జాతీయ పండుగల వరకు ఎంతో సంబురంగా నిర్వహించుకుంటాం. ఇక సంక్రాంతి లాంటి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై పతంగి ఎగరాల్సిందే. కైట్ ఫెస్టివల్ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతోపాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అవరోధం, అపాయం కలగకుండా నడుచుకోవడమే మానవ ధర్మంగా పలువురు ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ, ఆధ్యాత్మిక వేత్తలు, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. వివిధ రకాలు గాలిపటాలు ఎగురవేసే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కైట్ ఫెస్టివల్ను పురస్కరించుకొని తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చైనా మాంజాతో పెను ప్రమాదం
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో పతంగులు ఎగురవేసేందుకు మాంజాను వాడొద్దని, సాధారణ దారాన్నే వాడాలని జంతు, పక్షి, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. అయితే చైనీస్, నైలాన్, గ్లాస్ కోటెడ్ ఉన్న కాటన్ మాంజాలపై నిషేధం కొనసాగుతున్నది. ఎందుకంటే పక్షులు, జంతువులకే కాదు మనుషులకూ
తిప్పలు తప్పవని చెబుతున్నారు.
పంతగుల రకాలు…
అయితే ప్రతి విక్రయ కేంద్రంలో రకరకాల పంతగులు కొలువుదీరాయి. ఇందులో చేపరూపంతో కూడినవి కొన్నయితే.. గద్ద రూపంలో ఉన్నవి మరికొన్ని. అనేక బర్డ్స్ పోలికలు కలిగి ఉన్నవాటిని చిన్నారులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. జలచరాల మాదిరిగా కూడా అనేక గాలిపటాలు మార్కెట్లోకి రావడంతో చిన్నారులు వాటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు.
మెదక్ మార్కెట్లో… దుకాణాల కళకళ
మెదక్ పట్టణంలో సంక్రాతి పండుగ సందర్భంగా రద్దీ పెరిగింది. పండుగకు వారం రోజుల ముందు నుంచే మార్కెట్ కళకళలాడుతున్నది. ప్రధాన వీధులు, రహదారుల వెంబడి తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గాలిపటాలు కొనుగోలు చేస్తున్నారు.
రామాయంపేటకు పండుగ కళ..
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. వివిధ రకాల పతంగులు, మాంజాలు విక్రయ కేంద్రాలు వెలిశాయి. రాజకీయం, సినిమా, క్రికెట్ తదితర రంగాల ప్రముఖుల ఫొటోలు ముద్రించి ఉన్న పతంగులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పట్టణంలో సుమారు 15 వరకు పతంగుల విక్రయ కేంద్రాలు వెలిశాయి. ముగ్గుల కోసం రంగుల విక్రయాలు జరుపుతున్నారు. నిజాంపేట, భిక్కనూరు, నార్సింగి, చిన్నశంకరంపేట, బీబీపేట మండలాలవాసులు పట్టణానికి చేరుకుని విక్రయాలు జరుపుతున్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా విక్రయాలు జరగలేదని, ఈ ఏడాది గిరాకీ బాగానే ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు చిరువ్యాపారులు.
ఆకట్టుకునే పతంగులు ఎన్నో…
మార్కెట్లో ఈసారి విభిన్న రకాల పతంగులు లభిస్తున్నాయి. జాతీయ జెండా, చోటాభీమ్, సినిమా హీరోహీరోయిన్లు, ఫిష్, రాజకీయ ప్రముఖులు, స్పైడర్ మన్, సీతాకోకచిలుక, బెన్ టెన్, డేగ, వాహనాల బొమ్మలు ముద్రించి ఉన్న పతంగులకు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. పతంగులు సైజును బట్టి రూ.2 నుంచి రూ.100 వరకు నిర్ణయించిన ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* సంక్రాంతికి భవనాలపై పతంగులు ఎగురవేసేవారు అప్రమత్తంగా ఉండాలి. గాలిపటాలు ఎగురవేసే సమయంలో వెనక్కి, ముందుకు చూసుకొని కదలాలి. లేదంటే కిందపడిపోయే ప్రమాదం ఉంది.
* బంగళాలపై నుంచి ఎగురవేసే వారు చుట్టూ రెయిలింగ్ ఉన్న భవనాలపై నుంచే ఎగురవేయాలి.
* భవనాల ప్రహరీలపై ఎక్కి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయొద్దు.
* పతంగిని కీంచ్ కాట్ చేయబోయే సమయంలో తమ వెనక, ముందు తగిన స్థలం ఉందా? లేదా..? చూసుకోవాలి.
* తెగిపోయిన కైట్స్ కోసం పక్కనే ఉండే భవనాలపైకి దూకడం, పోటీ పడి భవనాలపై
పరుగెత్తడం ప్రమాదకరం.
* తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అటుఇటు ఆగమాగం పరుగెత్తితే వద్దని వారించాలి.
* భవనాలపై డీజేలు పెట్టి భారీ శబ్దాలతో కూడిన మ్యూజిక్తో ఇరుగు పొరుగు వారికి ఇబ్బందికరంగా ఉంటుంది.
* ముఖ్యంగా ప్రహరీ లేని బంగళాలు, అంతస్తులపై ఎక్కి పతంగులను ఎగురవేయొద్దు. మైదానాల్లోకి వెళ్లి గాలిపటాలను ఎగురవేసుకోవడం ఉత్తమం.
* రోడ్లపై పతంగులను ఎగురవేస్తే.. మాంజాతో ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే రోడ్లకు దగ్గరగా కూడా ఎగురవేయొద్దు.
* కైట్స్ విద్యుత్ వైర్లకు చిక్కుకుంటే పొడువాటి ఎండిన కర్రలతోనే తీయాలి. అంతకుమించి ఎక్కువ చేయకూడదు.
* తెగిపోయిన గాలిపటాల కోసం పైకి చూస్తూ వాటి వెంట పరుగెత్తవద్దు. ఎదురుగా వస్తువులు గానీ, వాహనాలు, ఇతరత్రా ఏవి ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
బహిరంగ ప్రదేశాల్లో పతంగులను ఎగురవేసుకోవాలి
విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్నచోట పతంగులు ఎగురవేయవద్దు వైర్లకు పతంగులు తగిలి చుట్టుకోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి. కాటన్, నైలాన్తో చేసిన మాంజాలే వాడాలి. మెటాలిక్ మాంజాలతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. పతంగులు, మాంజాలు కరెంట్ తీగలు, పరికరాలపై పడినప్పుడు వాటిని వదిలివేయాలి. తీగలపై పడిన పతంగులను లాగొద్దు. తెగిన తీగలను అసలే తాకొద్దు. ఏవైనా సమస్యలుంటే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి సమాచారం అందించాలి.
– మహేశ్, ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజినీర్
(న్యాల్కల్ మండలం)
చైనా మాంజా వాడితే చర్యలు…
పక్షుల పాలిట యమపాశాలుగా మారుతున్న చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు అటవీ, పోలీసు శాఖ అధికారులు విస్తృతంగా చర్య లు చేపడుతున్నారు. పతంగుల దుకాణాల్లో తనిఖీలు చేపడు తూ మాంజాతో కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నారు. చైనా మాంజా అమ్మితే దుకాణాల నిర్వాహకు లపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యత వహించాలని, చైనామాంజాను ఎవరూ వాడొద్దని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లలను గమనించాలి
సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు పతంగులు ఎగురవేసేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలి. మేడలు, డాబాలు, బంగ్లాలపై, వాటికి చుట్టూ పిట్టగోడలు లేని చోట్ల పతంగులు ఎగురవేయకుండా చూడాలి. రద్దీ ఉన్న ప్రదేశాల్లో పతంగులు ఎగురవేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమై ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. చెరువులు, నదులు, కుంటలు, పాడుబడిన బావులు, నాలాల దగ్గర పైకి చూసుకుంటూ పతంగులు ఎగురవేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. – వినయ్కుమార్, ఎస్సై, హద్నూర్
హ్యాపీగా పండుగ జరుపుకొందాం…
పతంగుల పండుగ అంటే ఎగిరి గంతేసేవారు ఎంతో మంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కైట్ ఫెస్టివల్ను ఆస్వాదిస్తారు. ఇక ఇప్పటికే నగంలోని పలు ప్రాంతాల్లో భారీగా పతంగుల దుకాణాలు వెలిశాయి. పక్షులే కాదు మనుషులకు, జంతువులకు ప్రాణాంతకంగా పరిణమించిన పతంగుల గాజుముక్కల మాంజాను వినియోగించవద్దు. ఇటు పక్షులనూ, అటు మూగజీవాలనూ రక్షించుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిది.
– డాక్టర్ గాజుల ప్రభాకర్, యువ శాస్త్రవేత్త
మూగజీవాలకే ప్రమాదం ఎక్కువ…
చైనా మాంజాతో అనేక పక్షులకు, మూగ జీవాలైన జంతువులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. పతంగులను సాధారణ దారాలతోనే ఎగురవేస్తే ఈ ప్రమాదాలను నివారించవచ్చు. అందుకు నగరవాసులందరూ సంక్రాంతి, దీపావళి వంటి పండుగలను మనుషులతోపాటు మూగజీవాలకు ఆటంకం కలగకుండా జరుపుకోవాలి.
– మహమ్మద్ ఖలీల్, పెట్ అనిమల్ ప్రేమికుడు