ఆ విద్యార్థులంతా రైతు, రైతు కూలీల కుటుంబాల పిల్లలు. సిద్దిపేట రూరల్ మండలంలోని బచ్చాయపల్లిలో ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న వారంతా సమీపంలోని లక్ష్మీదేవిపల్లి ఉన్నత పాఠశాలకు కాలినడక రోజూ వెళ్లి చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు ఉదయమే వ్యవసాయం, వ్యవసాయ పనులకు వెళ్తుండడం.. విద్యార్థులు సమయానికి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యను స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను విన్న హరీశ్రావు రెండు నెలల క్రితం స్వయంగా సైకిళ్లు కొనుగోలు చేసి ఉచితంగా 15 మంది విద్యార్థులకు అందజేసి మనసున్న మా రాజు అనిపించుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
సిద్దిపేటరూరల్, జనవరి 1: ఆ విద్యార్థులంతా రైతు, రైతు కూలీల కుటుంబాల పిల్లలు. బచ్చాయపల్లిలో ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న వారంతా సమీపంలోని లక్ష్మీదేవిపల్లి ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. అయితే బచ్చాయిపల్లి గ్రామం నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు రానుపోను 8 కిలోమీటర్లు కాలినడక వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తుండడంతో సరైన సమయానికి పాఠశాలలో దింపేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానిక బీఆర్ఎస్ నాయకులు సమస్యను గుర్తించి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లడంతో హరీశ్రావు 15 మంది విద్యార్థులకు సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసి అందించారు. ఒక్కో సైకిల్ ధర రూ.6 వేలు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికే సిద్దిపేటరూరల్ మండలంలోని పలువురు దివ్యాంగులకు ట్రైమోటర్ సైకిళ్లను అందించిన హరీశ్రావు తన ఔదార్యాన్ని మరోమారు చాటుకున్నారని పలువురు చెబుతున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించే మనసున్న మారాజు హరీశ్రావు అని కొనియాడుతున్నారు.
బచ్చాయిపల్లి నుంచి లక్ష్మీదేవిపల్లి స్కూల్కు వెళ్లాలంటే కాలినడక లేదంటే ఆటో. రెడీ అయి రోడ్డు మీదకు వస్తే ఆటో రావడానికి గంట సమయం పట్టేది. ఆ లోపు స్కూల్లో క్లాస్ మిస్సయ్యేవాడిని. సైకిల్ ఉంటే బాగుండు అనిపించేంది. హరీశ్రావుసార్ సైకిల్ ఇచ్చిండు. చాలా సంతోషంగా ఉంది. రోజు సైకిల్ మీద స్కూల్కు పోయి వస్తున్న.
హరీశ్రావు సార్కు చెప్పిన వెంటనే ఏ పని అయినా చేస్తడు. పిల్లలకు సైకిల్ లేక ఇబ్బందులు పడుతున్నరు అని బీఆర్ఎస్ నాయకులు చెప్పిండ్రు. స్పందించి ఒక్కో సైకిల్కు రూ.6 వేలు వెచ్చించి కొనుగోలు చేసి ఇచ్చిండ్రు. హరీశ్రావు సార్ ఎప్పటికీ ప్రజల మనిషి. సైకిల్ కొనిచ్చినంక పిల్లలు స్కూల్కు టైంకు పోతున్నరు. హరీశ్రావు సార్కు ధన్యవాదాలు.
పొద్దున్నే బడికి పోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఒక్కోసారి ఆటో రాక గంటపాటు వేచి ఉండాల్సి వచ్చేది. నడిచి వెళ్లే వాళ్లం. రానుపోను 7 కిలోమీటర్లు. సైకిల్ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. హరీశ్రావు సార్ సైకిల్ కొనిస్తడని చెప్పగానే సంతోషం వేసింది. అన్నట్టుగానే సైకిల్ కొనిచ్చిండ్రు. ఇప్పుడు స్కూల్కు సైకిల్పై త్వరగా వెళ్తున్న.
మా పిల్లలు బడికి వెళ్లేందుకు రోజూ ఇబ్బందులుపడుతుండే. రానుపోను ఏడెనిమిది కిలోమీటర్లు లక్ష్మీదేవిపల్లికి పోయి వస్తున్నరు. రోజు బండి మీద ఉదయం, సాయంత్రం దించి, తీసుకురావాలంటే టైం సరిపోకపోతుండే. పిల్లలు పడుతున్న ఇబ్బందులను స్థానిక బీఆర్ఎస్ నాయకులకు చెప్పినం. వాళ్లు హరీశ్రావు సార్కు చెప్పి సైకిల్ కొనిచ్చిర్రు. ఇప్పుడు మేం పని మీద ఎక్కడికి పోయినా రంది లేదు. పిల్లలు ఇంటికి సైకిల్ మీద పోయి వస్తుర్రు. హరీశ్రావుకు కృతజ్ఞతలు.
పిల్లలు బడికి పోవాలంటే కాలినడకన లేదా ఆటోలో, లేదంటే బండి మీద దించి రావాల్సిందే. వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్నప్పుడు టైంకు బడికి పంపాలంటే ఇబ్బంది పడేవాళ్లం. క్లాస్కు టైంకు పోయే వాళ్లు కాదు. సైకిల్ కొనివ్వాలని ఉన్నా పైసలు టైంకు లేకుండే. స్థానిక బీఆర్ఎస్ నాయకులు సమస్యను గుర్తించి ఎమ్మెల్యే హరీశ్రావు సార్కు చెప్పిండ్రు. స్పందించి వెంటనే రూ.6 వేలతో ఇచ్చి సైకిల్ కొనిచ్చిండ్రు. ఇప్పుడు పిల్లలు సమయానికి బడికి పోతున్నారు.
బచ్చాయిపల్లిలో ప్రైమరీ స్కూల్ అయిపోయినంక లక్ష్మీదేవిపల్లికి పోవాలి. స్కూల్కి రానుపోను 7 కిలోమీటర్ల దూరం అవుతుంది. పాఠశాలకు కాలినడకన, లేదంటే ఆటోలో లేక నాన్న బైక్ మీద వెళ్లాలి. నాన్నకు పని ఉందంటే టైంకు స్కూల్కు వెళ్లలేం. క్లాస్ కూడా మిస్సయ్యాం. ఇప్పుడు హరీశ్రావు సార్కు సైకిల్ కొనిచ్చిండు. టైంకు క్లాస్కు పోతున్నం. పాఠాలు మిస్ కావడం లేదు. హరీశ్రావుకు థ్యాంక్స్.