సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 13: జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈనెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం కంటి వెలుగు ఏర్పాట్లపై సీఎస్ టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్, వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీస్ మాట్లాడుతూ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారాన్ని ముందుగానే ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాంపు సిబ్బందికి భోజనం, ఇతర వసతులను కల్పించాలన్నారు. కార్యక్రమ నిర్వహణను అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా అన్ని పంచాయతీల్లో ఆశ, ఏఎన్ఎమ్, అంగన్వాడీ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి షెడ్యూలు వివరాలు తెలిపి, కంటి వెలుగుపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. క్యాంపునకు ముందు మూడు రోజుల నుంచి టామ్ టామ్ వేయించి ప్రజలకు తెలిసేలా చర్యలు చేపడుతున్నామని సీఎస్కు వివరించారు. శిబిరాల్లో షామియానాలు, మంచినీరు, కుర్చీ లు, టెబుళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బందికి భోజనం, అల్పాహారం, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.