‘మొన్ననే మీ మెదక్కు వచ్చిన. అప్పుడు మీరు చానా కోరికలు కోరిండ్రు. మీరు కోరిన కోర్కెలు అన్నీ తీర్చిన. రింగ్రోడ్ మంజూరు జేసిన. రామాయంపేట రెవెన్యూ డివిజన్ జేసిన. రామాయంపేటకు జూనియర్ కళాశాల ఇచ్చిన. పద్మాదేవేందర్రెడ్డి నాబిడ్డ. పద్మ అనుకుంటే పనులు ఎట్లా అవుతాయే మీరు చూస్తున్నారు కదా. మిమ్మల్ని ఒక్కటే మాట కోరుతున్నా.. మీఎమ్మెల్యేగా పద్మను మళ్లీ గెలింపించుకోండి. బ్రహ్మాం డంగా పనులు చేసుకుందాం. ఇంకా ఎక్కడికి సాగునీళ్లు కావాలన్నా మల్లన్నసాగర్ నుంచి తీసుకువస్తా. వచ్చిన ప్రాంతాలకు నీళ్లు వచ్చినయి. రాని ప్రాంతాలకు సాగునీళ్లు తీసుకువస్తా. మెదక్, నర్సాపూర్ ప్రాంతాలకు రావాల్సి ఉంది. కాల్వలు తవ్వుతున్నారు. అవి కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి అవుతాయి’.. అని సీఎం కేసీఆర్ అన్నారు.
బుధ వారం మెదక్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి మైదానంలో స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తండాలు, గ్రామాలు, పట్టణాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అశేష జనాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభలో రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సభలో కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. గులాబీల జెండలే రామక్క పాట ప్రజలకు పూనకాలు తెప్పించింది. సభలో జైకేసీఆర్..జైతెలంగాణ నినాదాలు మిన్నం టాయి. రోడ్లన్నీ జనంతో నిండిపోగా.. పట్టణమంతా గులాబీ మయంగా మారింది. సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ను నింపింది.
* సీఎం కేసీఆర్ ప్రజా ఆశ్వీరాద సభకు జనం ట్రాక్టర్లలో, డీసీఎంలలో రావడంతో బోధన్ చౌరస్తా అంతా జనంతో కిక్కిరిసింది.
* మెదక్ సీఎస్ఐ చర్చి కంపౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ అంతా బీఆర్ఎస్ కార్యకర్తలతో గులాబీమయంగా మారింది.
* సీఎం కేసీఆర్ను చూడటానికి పిల్లలు మొదలు, ముదుసలి వారు సైతం సభకు భారీగా తరలివచ్చారు
* జనం, బీఆర్ఎస్ కార్యకర్తలతో మెదక్ రాందాస్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా సీఎం సభకు తరలివచ్చారు.
* సీఎం సభకు వృద్ధులు ఒకరి చేతిని మకొకరు పట్టుకొని రావడంతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహానిచ్చింది ఆటపాటలతో అదరగొట్టిన మధుప్రియ
మెదక్ అర్బన్, నవంబర్ 15: మెదక్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి కంపౌండ్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. పల్లెలు, తండాలు, పట్టణాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ప్రాంగణానికి వచ్చే వరకు గాయని మధుప్రియ ఆట పాటలతో ఆలరించింది. మధుప్రియ పాటలు పాడుతుంటే జనం కేరింతలతో అరుస్తూ డ్యాన్స్లు చేస్తూ సభలో హోరెత్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వచ్చే వరకు ప్రజలు మధుప్రియ పాటలు పాడింది. సభా ప్రాంగణంతా యువకులు, వృద్ధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు ఆ పాటలకు డ్యాన్స్లు చేస్తూ సందడి చేశారు. గాయని మధుప్రియ ‘గుర్తుల గుర్తుంచుకో రామక్క’ అనే పాట పాడగా సభా ప్రాంగణంలోని జనమంతా కారు గుర్తును గుర్తుంచుకో అంటూ ఆమెతో పోటీపడి పాటలు పాడారు.