2018 ఎన్నికలకు ముందు హుస్నాబాద్లో ఆశీర్వాద సభ నిర్వహించి ఏకంగా 88 సీట్లు గెలుపొందామని, ఈ ఎన్నికల్లోనూ ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధిక సీట్లు గెలిచి రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధిస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 2014లో హుస్నాబాద్కు ఎన్నికల సభకు వస్తూ హెలికాప్టర్ నుంచి చూస్తే రాళ్లు, రప్పలు, ఎండిన పొలాలు, బీడువారిన భూములు మాత్రమే కనిపించాయని, తొమ్మిదిన్నరేండ్ల తరువాత ఇప్పుడు చూస్తే కనుచూపు మేర పచ్చని పంటపొలాలు, నిండుగా ఉన్న చెరువులు, కుంటలను చూస్తుంటే సంతోషం అనిపించిందన్నారు. గౌరవెల్లి లాంటి ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేసినా వెనుకడుగేయలేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, పనులను ఎమ్మెల్యే సతీశ్కుమార్, స్థానిక నాయకులు తన దృష్టికి తెచ్చారన్నారు. అన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ సభా వేదికగా హామీ ఇచ్చారు. తలలో నాలుకలా ఉండే సతీశ్కుమార్ను 50నుంచి 60వేల మెజార్టీతో గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు.
– సిద్దిపేట ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/హుస్నాబాద్, అక్టోబర్ 15
సిద్దిపేట ప్రతినిధి/హుస్నాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : 2018 ఎన్నికలకు ముందు హుస్నాబాద్లో ఆశీర్వాద సభ నిర్వహించి ఏకంగా 88 సీట్లు గెలుపొందామని, ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధిక సీట్లతో గెలిపి హ్యాట్రిక్ సాధిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో 95నుంచి 105 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. 2018లో హుస్నాబాద్ సభతో విజయం సాధించినందున ఈసారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టాలని పెద్దల సూచన మేరకు ప్రజల ఆశీర్వాదం కోసం తొలిసభ పెట్టామన్నారు. ఆదివారం హు స్నాబాద్లోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరై మాట్లాడారు. 2014లో హుస్నాబాద్కు ఎన్నికల సభకు వస్తూ హెలికాప్టర్ నుంచి చూస్తే రాళ్లు, రప్పలు, ఎండిన పొలాలు, బీడువారిన భూములు కనిపించాయని, తొమ్మిదిన్నరేండ్ల తర్వాత చూస్తే కనుచూపు మేర పచ్చని పంటపొలాలు, నిండుగా ఉన్న చెరువులు, కుంటలను చూస్తే సంతోషమనిపించిందన్నారు. గౌరవెల్లి లాంటి ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేసినా వెనుకడుగేయలేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ముందుకొస్తున్న పార్టీలకు గతంలో పదిసార్లు ఛాన్స్ ఇచ్చినా అభివృద్ధి జరుగలేదనేది ప్రజలు గుర్తించాలన్నారు.
నాడు డార్క్ ఏరియా.. నేడు గ్రీన్ ఏరియాగా మారింది..
రైతులకు ఉచిత కరెంటు, సాగునీరు ఇవ్వడంతో కంటినిండా నిద్ర, కడుపునిండా తిండి తింటున్నారని, కల్లాల నుంచే పంటను అమ్ముకొని ఆర్థికంగా నిలబడుతున్నారని చెప్పారు. చిగురుమామిడి మండలం ఒకప్పుడు డార్క్ ఏరియాగా ఉండేదని, ఇప్పుడు మిడ్మానేరు-తోటపల్లి నీళ్లతో గ్రీన్ ఏరియాగా మారిందన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు కొందరు మిత్రుల సూచనతో మహాసముద్రంగండిని స్వయంగా సందర్శించి పూర్తి చేసి 20గ్రామాలకు భూగర్భ జలాలను పెంచామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు హుస్నాబాద్ లాంటి కరువు ప్రాంతాలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. మహిళ బిందె పట్టుకొని కనిపిస్తే సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 1.10లక్షల ఎకరాలకు సాగునీరందించే గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారని, వాటన్నింటినీ ఎదుర్కొని పూర్తి చేశామన్నారు. కాల్వల నిర్మాణానికి రూ.250కోట్లు కేటాయించామన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే ఎన్జీటీ కేసు ను పరిష్కరించుకొని ప్రాజెక్టును ప్రారంభించుకొని కాల్వల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా పనులు చేసుకుందన్నామన్నారు.
రాయేదో రత్నమేదో ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్ ప్రజలు సూచించారు. ఆలోచించకుండా ఓటు వేస్తే ‘తీర్థం పోదామా తిమ్మక్క అంటే నువ్వు గుల్లె.. నేను సల్లె..’ అనే చందంగా మారుతుందన్నారు. సాఫీగా కొనసాగుతున్న అభివృద్ధిని కుంటుపడేలా చేయొద్దన్నారు. ఓటు అనే ది ప్రజల తలరాతను, రాష్ట్ర భవిష్యత్ను ప్రభావితం చేస్తుందన్నారు. అభాగ్యులను ఆదుకునేందుకు ఇచ్చే పింఛన్ వారికి సరిపోయేలా ఉండాలన్నారు. అందుకే మొదట అధికారంలోకి వచ్చాక రూ.200 నుంచి రూ.వెయ్యికి, రెండోసారి అధికారంలోకి వచ్చాక రూ.2,016లకు పెంచి అభాగ్యులకు ఆసరాగా నిలిచామని చెప్పారు. ఈ ఎన్నికల్లో పింఛన్ను రూ.3 వేలకు పెంచుతున్నామని, ఏడాదికి రూ.500ల చొప్పున రూ.5వేల వరకు పెంచుతామన్నారు. వచ్చే మార్చి నెల నుంచి రూ.3వేల పింఛన్ వస్తుందన్నారు.
హుస్నాబాద్లో పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత నాదే..
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు, సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని సీఎం కేసీఆర్ చెప్పారు. నియోజకవర్గంలో పలు సమస్యలు, పనులను ఎమ్మెల్యే సతీశ్కుమార్, నేతల తన దృష్టికి తెచ్చారన్నారు. శనిగరం చెరువు ప్రధాన కాల్వ నిర్మాణం, కట్ట మరమ్మతు పనులు పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చా రు. భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఎల్కతుర్తి మండలంలో బస్టాండ్ నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి విస్తరణకు సంబంధించి కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని దానిని కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సతీశ్ను 60వేల మెజార్టీతో గెలిపించండి..
తలలో నాలుగలా ఉండే సతీశ్ను హుస్నాబాద్ ప్రజలు ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో 50 నుంచి 60వేల మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. మచ్చలేని నాయకుడు, అభివృద్ధియే ఎజెండాగా పనిచేస్తున్న ఆయనను మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పటి హుస్నాబాద్కు ఇప్పటికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలన్నారు. మంచి వ్యక్తిగా ఉన్న సతీశ్ను గెలిపించుకుంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కెప్టెన్ కుటుం బం మొదటి నుంచి ప్రజాసేవకు అంకితమైందనన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం ద్వారా హుస్నాబాద్లో అద్భుత విజయా న్ని సొంతం చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క
గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండల మ్మ.. గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క అంటూ సోషల్ మీడియాలో వైర ల్ అవుతున్న బీఆర్ఎస్ ప్రచారం పాట హుస్నాబాద్లో ప్రజాఆశ్వీరాద సభలో మార్మోగింది.
ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం
సిద్దిపేట ప్రతినిది/హుస్నాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : హుస్నాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాఆశ్వీరాద సభ’ విజయవంతమైనది. దీంతో ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రజాఆశీర్వాద సభకు జనం తండోప తండాలుగా తరలివచ్చారు. వివిధ కులవృత్తుల వేషధారణలు, గిరిజనుల నృత్యాలు, గొల్లకుర్మల డిల్లెం బల్లెం, ఇలా సబ్బండ వర్గాలు సమూహంగా తరలివచ్చి సీఎం కేసీఆర్ పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. ప్రజాఆశీర్వాద సభకు తరలివచ్చిన జనంతో బీఆర్ఎస్లో నూతనోత్తేజం కనిపించింది. మం త్రి హరీశ్రావు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి విజయవంతం చేశారు. అనుకున్న లక్ష్యానికి మించి రెట్టింపు స్థాయిలో జనం తరలివంచి సభను విజయవంతం చేశారు. వివిధ వృత్తుల వారు బీఆర్ఎస్కు తమ సంఘీభావం తెలిపారు.
అన్నివర్గాల ప్రజలు సభకు పెద్దఎత్తున తరలి వచ్చారు. హుస్నాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.గిరిజన వేషధారణలో వచ్చిన మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. 2014,2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి లక్ష మందికి పైగా ప్రజల పెద్దఎత్తున తరలివచ్చా రు. హుస్నాబాద్ సభకు వచ్చిన జనం చూసి 50 నుంచి 60వేల ఓట్లతో సతీశ్మార్ గెలిచినట్లే అని సీఎం కేసీఆర్ అనడంతో యువత కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ జిందాబాద్.. హ్యాట్రిక్ సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.