సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 28: చేర్యాల మండలం గుర్జకుంట గ్రామంలో జడ్పీటీసీ శెట్టి మల్లేశం హత్య కేసులో అనుమానితులే నిందితులుగా తేలారు. కుల సంఘ వివాదాలు, రాజకీయ విభేదాలే హత్యకు కారణమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, హత్య వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం గుర్జకుంట గ్రామ ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణకు జడ్పీటీసీ శెట్టి మల్లేశం మధ్య కొంతకాలంగా కుల సంఘంలో రాజకీయంగా విభేదాలున్నాయి. వాటిని మనసులో పెట్టుకుని ఎలాగైనా మల్లేశాన్ని హతమార్చాలని సత్యనారాయణ పథకం వేశాడు. ఈ నెల 26న ఉదయం గుర్జకుంట శివారులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న జడ్పీటీసీ మల్లేశాన్ని మరో నిందితుడు బస్వరాజు సంపత్కుమార్తో కలిసి సత్యనారాయణ కారుతో గుద్దాడు. కిందపడిన మల్లేశాన్ని కమ్మ కత్తితో మల్లేశం తలపై బలంగా కొట్టారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి మల్లేశం కింద పడిపోయాడు. అనంతరం నిందితులు పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు 108లో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మల్లేశం మృతి చెందాడు. మల్లేశం భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐ శ్రీనివాస్, ఎస్సై భాస్కర్రెడ్డితో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 27న మంగళవారం ఇద్దరు నిందితులు తామే చంపామని చెప్పి లొంగిపోయారని, వారి వద్ద నుంచి కారు, కత్తి స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు.
ఇటీవల దారుణహత్యకు గురైన జడ్పీటీసీ శెట్టి మల్లేశం స్వగ్రామం గుర్జకుంటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సత్యనారాయణ మరొకరి సహాయంతో కారుతో ఢీకొట్టి, కత్తితో తల నరికిన చంపినట్లు పోలీసులకు లొంగిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున్న గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేలా సీపీ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్, గజ్వేల్ ఏసీపీల ఆధ్వర్యంలో చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు భాస్కర్రెడ్డి, చంద్రమోహన్, నారాయణ ఆధ్వర్యంలో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. బుధవారం నిందితుల తరుఫు మహిళపై జడ్పీటీసీ బంధువులు చేయి చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ పుర్మ మమత ఇంటిపైకి ఓ గ్యాంగ్ వెళ్లడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో సాధారణ పరిస్ధితుల నెలకొనే వరకు పికెటింగ్ కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.