చేగుంట, ఫిబ్రవరి 19: కరువు కాలంలో గోదావరి జలాలు పారుతాయని ఎప్పుడైనా అనుకున్నారా..? ఎక్కడో ఉన్న గోదారమ్మ మన చేగుంటకు వచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతున్నామంటే సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు నిదర్శనమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కొండపోచమ్మ కెనాల్ కాల్వల ద్వారా చేగుంట మండల పరిధిలోని బోనాల్ మీదుగా రామాయంపేట కాల్వల్లో వెళ్తున్న గోదావరి జలాలకు మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మామూలుగా గ్రామాల్లో దసరా, బతుకమ్మ పండగలు వస్తే ఎంతో సంతోషంగా ఉంటుందో, ఈ మండుటెండల్లో గోదావరి జలాలు ప్రవహిస్తే అంతకంటే ఎక్కువ పండగ వాతావరణం కనిపిస్తున్నదన్నారు.
నేడు సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంత బీడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టులు పూర్తి చేసి గోదారి జలాలను విడుదల చేశామన్నారు. ఇటీవల మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మొన్న కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయగా చేగుంట, రామాయంపేట, దుబ్బాక కాల్వలు గోదావరి జలాలతో కళకళలాడుతున్నాయన్నారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో నుంచి 20 తాటి చెట్ల ఎత్తులో నుంచి చేగుంటకు నీరుతీసుకురావడం కష్టమైన పని అని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ దానిని నిజం చేశారన్నారు.
శంకరంపేట కాల్వ పూర్తయితే చేగుంట మండలానికి మొత్తం సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు. కరువు కాటకాలతో సాగునీటికి గోస పడుతున్న దుబ్బాక నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున చెరువు కాల్వలకు సాగునీరు విడుదల చేయడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో మాయ మాటలు చెప్పిన నాయకులు ఎక్కడికి వెళ్లారో, ఏమి చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాడెం వెంగళ్రావు, నార్సింగి జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్రెడ్డి, మ్యాకల పరమేశ్, మాజీ చైర్మన్ కొమండ్ల నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పట్నం తానీషా, సర్పంచ్ రాములు, అబ్రబోయిన మల్లయ్య, మోహన్, బాల్నర్సింహులు, ఎంపీటీసీలు హోళియనాయక్, నవీన్, నాయకులు బాపురెడ్డి, వడ్డెపల్లి నర్సింహులు, రమేశ్, నందం, అంజిరెడ్డి, అంజాగౌడ్, జగన్గౌడ్, గొర్రె రమేశ్, లచ్చిరెడ్డి, బాపురెడ్డి తదితరులున్నారు.