హుస్నాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం కోహెడ మండలంలోని శనిగరంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శనిగరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో మాట్లాడారు. చెంచల్చెర్వుపల్లిలో సీతారామచంద్రస్వామి ఆలయం నవగ్రహ, ధ్వజశిఖర యంత్ర ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు తెచ్చి రైతులను ఆదుకోవాల్సిన బండిసంజయ్ కల్లాల్లో పండుకుంటాననడం హాస్యాస్పదమన్నారు. కల్లాల్లో కాకుండా ఢిల్లీలో పండుకొని కరువు నిధులు తేవాలన్నారు.
నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తే అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఆరు గ్యారెంటీలపై విమర్శలు చేస్తున్న బండిసంజయ్ విభజన హామీలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. వర్షాలు పడక కరువు పరిస్థితులు వచ్చాయన్నారు. సాగు, తాగునీటి వినియోగంపై ప్రభు త్వం సమీక్షలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.