మెదక్ అర్బన్, జనవరి 9 : నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయ రాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే అతృత అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరమని తెలిసినా కొందరు ముందు వెనుకా గమనించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాఫిక్ రద్దీలోనూ సెల్ఫోన్ మాట్లాడుతూ క్షణాల్లో జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారు. వారే కాకుండా ఎదుటివారిని ప్రమాదంలోకి నెట్టి తీవ్ర నష్టాన్నా మిగుల్చుతున్నారు. యుక్త వయస్సులో అధిక సెల్ఫోన్ వినియోగం యువత పాలిట శాపంగా మారుతున్నది. ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్న సంఘటనలు తరచూ సంభవిస్తున్నాయి.
ఇయర్ఫోన్స్ వాడకం..
చెవుల్లో ఇయర్ఫోన్స్, బ్లూటూత్ పెట్టుకొని పరధాన్యంగా డ్రైవ్ చేసేవారు చుట్టుపక్కల శబ్దాలు వినిపించక ప్రమాదలకు కారణమవుతున్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్ మరింత ప్రమాదం. సెల్ఫోన్ వాడే వ్యక్తి కేవలం కాల్ వచ్చినప్పుడే లిఫ్ట్ చేసి మాట్లాడతారు. కాని ఇయర్ఫోన్స్తో డ్రైవింగ్ చేసేవారు ఎక్కువ మంది కాల్ మాట్లాడటం కన్నా సంగీతం వింటూ ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారు. ఇలా వాహనాలు నడపడంతో అమాయక ప్రజలు బలవుతున్నారు. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ ప్రభావం కుటుంబంపై జీవితాంతం ఉంటుంది.
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం
సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టం 184(ఏ) ప్రకారం మొబైల్స్, ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ వామనాలు నడిపితే రూ.500 జరిమానా విధిస్తారు. అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే రూ.1000 జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తారు.
సెల్ఫోన్ డ్రైవింగ్ నేరం..
సెల్ఫోన్ డ్రైవింగ్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోని మాట్లాడటం నేరం. ఇలా చేయడంతో చాలా మంది వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ యువతే అధిక శాతం ప్రమాదాల బారిన పడుతున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించే వాహనదారులు ఒక్కసారి వారి కుటుంబాల గురించి ఆలోచించాలి. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు ఇంటికి పెద్దదిక్కు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నవారు చాలా మంది ఉన్నారు.
–సైదులు, మెదక్ డీఎస్పీ