గుమ్మడిదల, జనవరి 4 : సరిపడా బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్బోర్డు ప్రయాణం చేస్తేనే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే దుస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో మహిళల రద్దీ పెరిగింది. దీంతో ఉదయం కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్సుల కొరత ఏర్పడంతో ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకంతో ఆటోడ్రైవర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే ప్రతి ఆర్టీసీ బస్సు మహిళలతో కిక్కిరిసిపోతుంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. సమయానికి బస్సులు రాక రోడ్లపై గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారుల ఇబ్బందులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.