సిద్దిపేట రూరల్, మే 23: అధిక దిగుబడులను సాధించే క్రమంలో రైతులు ఇష్టానుసారంగా రసాయనాలను వినియోగిస్తున్నారు. ఫలితంగా భూములు నిస్సారం అవుతున్నాయి. దీంతోపాటు ఏటేటా దిగుబడులు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. నేడు కూడా ముప్పై ఏండ్ల కిందట వచ్చిన దిగుబడులే వస్తున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. బస్తాలకొద్దీ రసాయనిక ఎరువులు కుమ్మరిస్తున్నా, పెట్టుబడులు రాని దైన్యం. పంటలకు 16 రకాల పోషకాలు అవసరమని, రైతులు వాడుతున్న రసాయనిక ఎరువులతో కేవలం ఒకటి, రెండు పోషకాలు మాత్రమే అందుతున్నాయని అంటున్నారు. బదులుగా సేంద్రియ ఎరువులు వాడితే మొక్కలకు అందాల్సిన 16 రకాల పోషకాలు అందుతాయని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పెట్టుబడుల భారం..
పశుసంపద తగ్గిపోవడం….. రసాయనిక ఎరువులకు అలవాటు పడడంతో భూసారం తగ్గిపోతున్నది. దీంతో దిగుబడులు రావడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా బస్తాల కొద్దీ యూరియా, డీపీఏ వేయడంతో నేల భౌతిక స్వభావం మారిపోతున్నది. రసాయనిక ఎరువులు వాడడం పెరుగుతుండడంతో పెట్టుబడుల భారం కూడా పెరుగుతోంది. మక్కజొన్న, పత్తి పంటలు భూసారాన్ని లాగేస్తాయి. దీనికితోడు యూరియా, డీపీఏలు మరింత నేలసారాన్ని పీల్చివేస్తాయి. నేలలో లవణాలు క్షీణించి దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. భూసారాన్ని పెంచుకునేందుకు తొలకరి వానలు పడినప్పుడు మే, జూన్ నెలల్లో దుక్కులు కలియదున్ని పిల్లిపెసర, జీలుగ వేసుకోవాలి. అవి మొలకెత్తిన తర్వాత కలియదున్నితే మూలకాలుగా మారుతాయి.
పోషకాలు అనేకం..
వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు, పచ్చిరొట్ట, పశువుల ఎరువు వాడడంతో పంటలకు 16 రకాల పోషకాలు అందుతాయి. వీటిలో సూక్ష్మపోషకాలైన ఐరన్, కాపర్, మెగ్నీషియం, సల్ఫర్, జింక్ తదితరాలన్నీ ఉంటాయి. వీటికితోడు జీవ నియంత్రణ ఎరువులు వేస్తే తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. ఒక్కసారి సేంద్రియ ఎరువులు వేసినంత మాత్రాన దిగుబడులు రావు. రసాయనిక ఎరువులకు అలవాటు పడిన భూముల్లో కొన్ని ఏండ్లపాటు సేంద్రియ ఎరువులు వాడితేనే ఫలితం వస్తుంది. రైతులు రసాయనిక ఎరువులను వాడుతూ పోతే దిగుబడులు ఏమాత్రం రాకపోగా పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి ఎదురవుతుంది.
ప్రయోజనాలు..
వర్మీ కంపోస్ట్తో నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. ఇది ఆ పంటకే కాకుండా రెండు మూడు పంటలపై ప్రభావం చూపుతుంది. మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్తోపాటు పైరు ఎదుగుదలకు అవసరమయ్యే రసాయనాలు సేంద్రియ ఎరువుల్లో అధికంగా ఉంటాయి. భూమికి ఉపయోగమైన సూక్ష్మజీవులు వృద్ధిచెంది నేలకు అందిస్తాయి. కూరగాయలు, పండ్ల ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. రంగు, రుచి, వాసనతోపాటు రవాణాలో నిల్వ ఉండే గుణాలు కలిగి ఉంటాయి. సేంద్రియ సాగుతో పండించిన ధాన్యానికి ధర కూడా ఎక్కువ పలుకుతుందని అధికారులు చెబుతున్నారు.
సేంద్రియ ఎరువుల తయారీ సులువే..
సేంద్రియ ఎరువులను సులువుగానే తయారుచేసుకోవచ్చు. పశువుల వ్యర్థాలను ఇష్టానుసారంగా పారవేయకుండా చెత్తను విడదీసి పేడను మాత్రమే ఒక పద్ధతి ప్రకారం నిల్వ ఉంచితే కొద్ది రోజుల్లో లభించేదే సేంద్రియ ఎరువు. జిల్లాలోని కొందరు రైతులు సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. రసాయనిక ఎరువుల వినియోగంతో వచ్చే దిగుబడుల కన్నా సేంద్రియ ఎరువుల వినియోగంతో నాణ్యమైన పంట వస్తుంది.