సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 10 :ప్రజలు ఎంతోఆశగా ఎదురుచూసిన రాష్ట్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ, వరికి బోనస్, రైతుభరోసా, చేయూత తదితర పథకాలకు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సరిపడా నిధుల కేటాయింపులు లేకపోవడంతో హామీలు అటకెక్కినట్లేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన వ్యవసాయరంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వలేదని అన్నదాతల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది. శనివారం రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై అన్నివర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్పా ఏఒక్క వర్గానికి ప్రయోజనం చేకూరేలా లేదని మేధావులు, రైతు సంఘాల నాయకులు, ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కావాల్సిన నిధులను బడ్జెల్లో కేటాయించలేదు. అధికారంలోకి రాగానే రైతులకు డిసెంబర్ 9న రెండు లక్షల రూపాయలు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదు. పైగా ఈ బడ్జెట్లో రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని రైతు సంఘాల నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల నుంచి తమ పంట పంట రుణాలు మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతులకు నిరాశనే మిగిలింది. ఇప్పటి వరకు ఏ సమయంలోపు పంట రుణమాఫీ చేస్తారు. ఏ విధంగా రుణమాఫీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా బడ్జెట్లో పేర్కొనలేదు. ఇక రైతు భరోసా ఊసేలేదు. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ప్రతి ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఏటా రెండుసార్లు రైతుల ఖతాల్లో జమచేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఏడాదికి ఇస్తానని ప్రకటించింది. ప్రస్తుత యాసంగి పంటలకు గత ప్రభుత్వం మాదిరిగానే రైతుబంధు వేసింది. గడిచిన రెండు నెలల నుం ఇంత వరకు రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధు పడలేదు. కేవలం రెండు ఎకరాలలోపు రైతులకు వేసి నిలిపివేశారు. దీంతో రైతులకు రైతుబంధు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వరి పంటకు బోనస్ ఇస్తా అని చెప్పి బడ్జెట్లో దాని ఊసెత్తలేదు. మక్కలు, కంది, సోయా తదితర పంటలకు మద్దతు ధర గురించి ప్రస్తావించలేదు. చేయూత పథకం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ ఏఒక్క వర్గాన్ని తృప్తి పరిచేలా లేదు.
ఆరుగ్యారంటీలు పూర్తిగా అమలయ్యేనా…
ఆరుగ్యారంటీల పథకాలకు శాసనసభలో చట్టం చేస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పి ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గార్యంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందని, బడ్జెట్లో వాటికి కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని ప్రతిపక్షాలతో పాటు ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బడ్జెట్ చూస్తే తేటతెల్లమవుతున్నదని నిరుద్యోగులు, విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, మూడు డీఏల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. బడ్జెట్లో ఆ మాట చెప్పనే లేదు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోతున్న ఆటోరిక్షా కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయక పోవడంపై ఆటోవాలాలు ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వడంతో పాటు ప్రతి ఎకరాకూ సాగు నీరిచ్చి రైతుల పంటలను కాపాడింది. ఈ ప్రభుత్వం ఇప్పుడే అనధికార కరెంట్ కోతలు విధిస్తున్నది.దీంతోపాటు తరుచుగా కరెంట్ ట్రిప్ అవుతున్నది. యాసంగి పంటలు వేసి రెండు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదుల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో మాటలు గొప్ప.. పనులు సున్నా అన్నట్లుగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ సర్కారుపై అన్నివర్గాల పెదవి విరుపు ఉమ్మడి మెదక్ జిల్లా ఊసేలేదు…
బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు ఏమైనా నిధులు వస్తాయేమో అని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ పైసా నిధులు కేటాయించ లేక పోయారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఓట్లు పడేదాక ఒకోలా.. ఓట్లు పడ్డాక మరోలా’ కాంగ్రెస్ తీరు ఉందని అన్నివర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలవి కానీ హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యారంగానికి తీవ్ర అన్యాయం
బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్, మెస్చార్జీలపై సృష్టత లేదు. రాష్ట్రంలో 800 గురుకులాలు, కళాశాలలకు పక్కాభవనాలు లేవు. వాటి నిర్మాణానికి ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు. వెంటనే విద్యారంగానికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలి.
– కిందిదొడ్డి సతీశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు,కంగ్టి
విద్యారంగానికి నామమాత్రపు నిధులు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విద్యారంగానికి ఏమాత్రం మేలుచేసేలా లేదు. కోఠారి కమిషన్ ప్రకారం విద్యాశాఖకు బడ్జెట్లో 12శాతం నిధులు కేటాయించాలి. దీనిని ప్రభుత్వం పాటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనఊరు-మనబడి’ పథకాన్ని ఈ సర్కారు నీరుగారుస్తున్నది. దానికి సంబంధించిన బడ్జెట్లో పేర్కొనక పోవడం విడ్డూరంగా ఉంది. ప్రతి మండలంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహా విద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పడం మంచి పరిణామం. వచ్చే విద్యా సంవత్సరానికి 20 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ గురించి బడ్జెట్లో ప్రస్తావించక పోవడం నిరుద్యోగులకు నిరాశనే మిగిల్చింది.
– మల్లారెడ్డి, పీఆర్టీయూ మెదక్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు
రైతులను దగా చేసేలా బడ్జెట్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రైతుల నడ్డివిరిచేలా ఉంది. ఎన్నికల ముందు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు గుప్పించిన కాంగ్రెస్ ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. వ్యవసాయానికి ఆశించిన స్థాయిలో నిధులు ప్రకటించలేదు. రైతుభరోసా, రైతుబీమా, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీఇచ్చి అందుకనుగుణంగా నిధులివ్వలేదు. రైతుబంధు నిధులను ఇంకా ఖాతాల్లో జమచేయలేదు. వరి ధాన్యాన్ని అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. కాంగ్రెస్ తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వ్యవసాయానికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి.
– శివకుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్
పీఆర్సీ, డీఏ అంశాలు ప్రస్తావించక పోవడం బాధాకరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఆర్సీ, డీఏ తదితర ఉద్యోగుల ప్రయోజనాలను ప్రస్తావించక పోవడం బాధాకరం. బడ్జెట్లో విద్యారంగానికి రూ.21,389కోట్ల నిధులు కేటాయించారు. వీటిలో ఏయే విభాగాలకు ఎంత అనేది స్పష్టం చేయక పోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నది. బడ్జెట్పై చర్చ సందర్భంగానైనా పీఆర్సీ అమలు, డీఏ, ఫిట్మెంట్పై స్పష్టత ఇవ్వాలి. బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా ఇతర శాఖలకు కేటాయించకుండా ఖర్చు చేయాలి. పబ్లిక్స్కూళ్ల ఏర్పాటు, గురుకులాలకు సొంత భవనాల నిర్మాణం సత్వరంగా చేపట్టాలి. బడ్జెట్లో ఉద్యోగులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– గంగిశెట్టి మహేందర్, టీఆర్టీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు