కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టిన క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీదే. దశాబ్దాలుగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాతుకుపోయింది. పదిసారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నారాయణఖేడ్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అంతటిబలమైన కాంగ్రెస్ను బీఆర్ఎస్ గట్టిగా దెబ్బకొట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహారెడ్డి భూపాల్రెడ్డి రెండుసారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజాబలంతో రాబోయే ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని భూపాల్రెడ్డి సొంతం చేసుకోనున్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో అభివృద్ధి జాడలు ఎరగని ‘ఖేడ్’ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. రైతు ఆత్మహత్యలు, వలసలు, నీటికొరత, మౌలికవసతుల కొరతతో ‘ఖేడ్’ అన్నిరంగాల్లో వెనుకబడి ఉండేది.
అలాంటి ఈ నియోజవకర్గానికి సీఎం కేసీఆర్ నిధుల వరద పారించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించారు. వందలకోట్ల నిధులు వెచ్చింది రహదారులు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు. నారాయణఖేడ్ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చటంతో పాటు కొత్తగా నాలుగు మండలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ సంకల్పం, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి నిద్దేశనం, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కార్యదక్షత ఫలితంగా నారాయణఖేడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈ నియోజవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు తీసుకువస్తున్నారు. గోదావరి జలాలతో నారాయణఖేడ్ నియోజవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందనున్నది. నారాయణఖేడ్ అభివృద్ధి బాటలో పయనిస్తుండడంతో ప్రజలు బీఆర్ఎస్ వెన్నంటే ఉంటామని, ఎన్నికల్లో గెలిపిస్తామని చెబుతున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు పది ప ర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజల ఓట్లతో పదిసారు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏనాడూ నియోజవకర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. దీంతో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా, అత్యధిక వలసలు ఉండే ప్రాంతంగా నారాయణఖేడ్కు పేరుపడింది. కాంగ్రెస్తోపాటు టీడీపీ కూడా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. ఫలితంగా ప్రజలు తాగునీటికి సైతం నోచుకోని పరిస్థితి నెలకొంది. 2016లో బీఆర్ఎస్ గెలుపొందిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. వందల కోట్ల నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది.
అలాగే నారాయణఖేడ్లో పోలీసు డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు అయింది. కొత్తగా సిర్గాపూర్, నాగల్గిద్ద, నిజాంపేట, తడ్కల్ మండలాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వం వంద తండాలను పంచాయతీలుగా మార్చింది. రూ.289 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అం దజేస్తుంది. రూ.456 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రహదారులు, గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాల్వలను, వైకుంఠధామాలు ఇతర అభివృద్ధి పనులను చేపట్టింది. రూ.110కోట్లతో తండాలకు రహదారులు, రూ.51.26 కోట్లతో బ్రిడ్జిలను నిర్మించింది. రూ.50 కోట్లకుపైగా నిధులతో నియోజకవర్గంలో 1100 డబుల్బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేసింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ రూ.25కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. రూ.60 లక్షలతో ఆక్సిజన్ పార్కు, రూ.1.20 కోట్లతో మహాప్రస్థానాన్ని ప్రభుత్వం నిర్మించింది.
సాగునీరు లేక బీడుపడుతున్న నేలలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తరలించేందుకు సీఎం కేసీఆర్ నారాయణఖేడ్కు బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ సవ్యంగా నారాయణఖేడ్లో బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రి హరీశ్రావు ఈ ఏడాది మార్చిలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారు. రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతున్నాయి. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 166 గ్రామాల్లో 1.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు 19, 19ఏ ప్యాకేజీ పనులు రూ.800 కోట్లతో జరుగుతున్నాయి. కాళేశ్వరం కాల్వల ద్వారా నియోజకవర్గంలో 30వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ప్రభుత్వం నారాయణఖేడ్ నియోజవకర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు ను రూ.25 కోట్లతో ఆధునీకరించారు. మిషన్ కాకతీయతో రూ.98 కోట్ల వ్యయంతో 289 చెరువులను ప్రభు త్వం పునరుద్ధరించింది. రూ.5.28 కోట్లతో మూ డు కొత్త చెక్డ్యామ్లను నిర్మించిచంది. రూ.58 కోట్లతో ఎనిమిది చెరువులను నిర్మిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన విద్య, వైద్య సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. నారాయణఖేడ్లో రూ.6 కోట్లతో వంద పడకల దవాఖాన, రూ.11 కోట్లతో 50 పడకల మాతాశిశు దవాఖాన, 1.10 కోట్లతో డయాలసిస్ సెంటర్, రూ.2.5 కోట్లతో మినీ టి డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ దవాఖానలో రూ.1.03కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ను ప్రభుత్వం నిర్మించింది. కరస్గుత్తి, కల్హేర్లో రూ.11 కోట్ల వ్యయంతో 30 పడకల దవాఖానలను నిర్మించింది. రూ.3.12 కోట్లతో నిజాంపేట, సిర్గాపూర్లో పీహెచ్సీల ఏర్పాటు చేసింది. కొత్తగా ఎనిమిది గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది.
2016లో వచ్చిన ఉప ఎన్నికలతో నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయాలు మలు పు తిరిగాయి. అప్పటివరకు కాంగ్రెస్, టీడీపీలు నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయాలపై గుత్తాధిపత్యం చలాయిస్తుండగా 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన మహారెడ్డి భూపాల్రెడ్డి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం వెనక మంత్రి హరీశ్రావు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో సైతం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని గెలిపించారు. 58,508 ఓట్ల మెజార్టీతో భూపాల్రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన భూపాల్రెడ్డికి నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరుంది. భూపాల్రెడ్డి స్థానికంగానే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్న్నురు. అలాగే ‘ఖేడ్’ నియోజకవర్గ అభివృద్ధికి భూపాల్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో భూపాల్రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భూపాల్రెడ్డి ప్రజాబలంతో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు నారాయణఖేడ్ నియోజవర్గం. అప్పారావు షెట్కార్, మహారెడ్డి వెంకట్రెడ్డి, పట్లోళ్ల కిష్టారెడ్డి గతంలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని శాసించగా ప్రస్తుతం వారి వారసులు మహారెడ్డి భూపాల్రెడ్డి, సంజీవరెడ్డి, సురేశ్షెట్కార్ నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. 1952లో నారాయణఖేడ్ నియోజకవర్గం ఏర్పాటు అయ్యింది. నారాయణఖేడ్ అసెంబ్లీకి బై ఎలక్షన్తో కలుపుకుని 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పదిసార్లు కాంగ్రెస్ గెలుపొందగా, రెండుసార్లు బీఆర్ఎస్, రెండు సార్లు టీడీపీ, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1952లో మొదటిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పారావు షెట్కార్ గెలుపొందారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో మరోమారు అప్పారావు శెట్కార్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఆర్.దేశ్పాండే ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 ఎన్నికల్లో అప్పారావు షెట్కార్ తమ్ముడు శివరావు షెట్కార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1972 ఎన్నికల్లో మహారెడ్డి వెంకట్రెడ్డి తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1978 ఎన్నికల్లో శివరావు శెట్కార్ కాంగ్రెస్ ఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో తిరిగి మహారెడ్డి వెంకట్రెడ్డి టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో వచ్చిన ఎన్నికల్లో తిరిగి శివరావు షెట్కార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 ఎన్నికల్లో కిష్టారెడ్డి కాంగ్రెస్ నుంచి, 1994 ఎన్నికల్లో మహారెడ్డి విజయపాల్రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కిష్టారెడ్డి, 2004 ఎన్నికల్లో సురేశ్షెట్కార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2009, 2014 జరిగిన ఎన్నికల్లో కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2016లో కిష్టారెడ్డి మృతి చెందటంతో మొదటిసారి నారాయణఖేడ్కు ఉప ఎన్నికలు వచ్చాయి.