కోహెడ, ఏప్రిల్ 10: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో గెలిచేది బీఆర్ఎస్సే అనే కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. పార్టీ వదిలిన వారి గురించి మాట్లాడేది లేదని, ఉన్నవాళ్లను పార్టీ కాపాడుకుంటుందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలాల బాట పట్టగానే కాంగ్రెస్కు భయం పుట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 100 రోజులు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. యాసంగి వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చేవరకు వదిలిపెట్టేదిలేదన్నారు. పార్లమెంట్లో ప్రజల సమస్యలపై గళం విప్పి నిధులు తెస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని, గత ఐదేండ్లలో కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ చేసింది ఏమీలేదన్నారు.
అబద్ధ్దాల హామీలు ఇచ్చి ప్రజలను వంచించిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఆగమైందన్నారు. రైతు భరోసా ద్వారా రూ.15,000, మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. రైతులకు బోనస్ ఇచ్చే వరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కేసీఆర్ బయటకు రాగానే గాయత్రి పంపు హౌస్ మోటార్లు ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ దేవేందర్రావు, మాజీ ఎంపీపీ శ్రీకాంత్, జిల్లా నాయకులు సురేశ్, ఆవుల మహేందర్, తడ్కల రాజిరెడ్డి, భీంరెడ్డి రాజిరెడ్డి, ఇప్పరపల్లి కృష్ణమూర్తి, లక్ష్మణ్, సంజీవరెడ్డి, వంశీధర్రెడ్డి, అశోక్రెడ్డి, లక్ష్మణ్రావు, షేక్ వలీ, కుమారస్వామి, సుతారి కనుకయ్య, మల్లేశం పాల్గొన్నారు.