సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 1: పొద్దుతిరుగుడు కొనుగోలు కోటా విడుదల చేయకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, తక్షణమే కోటా విడుదల చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ వంగ నాగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మచ్చ వేణుగోపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు రైతుల వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం పొద్దుతిరుగుడు పంటను కేంద్ర ప్రభుత్వ కోటాలో కొనుగోలు చేసి, కోటా పూర్తి కావడంతో కొనుగోళ్లు నిలిపి వేశారన్నారు. పదిరోజులుగా పొద్దు తిరుగుడు రైతులు మార్కెట్ యార్డులోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పది రోజులుగా ఇక్కడే ఉండి కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని పొద్దుతిరుగుడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు నిలిచిపోయి దాదాపు పదిరోజులవుతుంది. ఒక్కొక్క రైతు పంట కోసి నెలరోజులు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం కోటా పూర్తయిందని కొనుగోళ్లు నిలిపివేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోటా విడుదల చేయకుండా జాప్యం చేయడంతో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. పది రోజులగా కొనుగోలు కేంద్రం వద్దనే పడిగాపులుకాస్తూ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు జిల్లాలోని అనేకమంది రైతులు సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటే కేవలం రూ.3,500 నుంచి రూ.4 వేలు మాత్రమే చెల్లించే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్ల కొన్నదో.. ఇప్పుడూ అట్ల కొనాలె. ఎందుకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నరు. ఎనకట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి రోజులు ఉండెనో మళ్లీ అలాంటి రోజులు వచ్చినయి. మొన్నటి దాకా కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగుండె. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని కేసీఆర్ చూసుకున్నడు. మల్లన్నసాగర్ నీళ్లు ఇచ్చిండు, మంచిగ కరెంట్ ఇచ్చిండు. మళ్ల ఇప్పుడు బాధలు పడుతున్నం. సాగు నీళ్లు లేవు, కరెంట్ ఎప్పుడస్తదో తెల్వదు. దయచేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా పొద్దుతిరుగుడు ధాన్యం కొనాలె.
మాది మల్యాల గ్రామం. ఎప్పుడు మాకు ఇట్ల కాలేదు. ఐదారేండ్ల సంది బీఆర్ఎస్ ప్రభుత్వం పొద్దుతిరుగుడు పంట మంచిగ కొన్నది. పొద్దుతిరుగుడు పంట కోసి నెల అయితుంది. ఇప్పుడు మేము బీట్కు తీసుకొచ్చి పది రోజులైతాంది. ఎందుకు ఇట్ల ఇబ్బంది పెడుతున్నరో అర్థమైతలేదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుంట పంట కొనుగోలు చేయాలె.