రాయపోల్, ఏప్రిల్ 13: ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లను చిత్తుగా ఓడించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలతో కలిసి హరీశ్రావు మాట్లాడుతూ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించుకున్నామన్నారు.
దేశంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్రావు హామీలు నెరవేర్చకుండానే మళ్లీ ఓట్ల కోసం గ్రామాల్లో తిరగడం సిగ్గుచేటన్నారు. ఆయన మోసపూరిత హామీలను దుబ్బాక ప్రజలు తెలుసుకోవాలని హరీశ్రావు యువతకు సూచించారు.
6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. కార్యక్రమానికి వచ్చేటప్పుడు మిరుదొడ్డి మండలంలో మహిళా రైతులతో మాట్లాడానని, వడ్లు ఎవరూ కొనడంలేదని వాపోయారన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ. 2500, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని హరీశ్రావు చెప్పారు. జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి మీకు సుపరిచితుడని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు.
గతంలో దుబ్బాకలో అనాథలు రాధా, రాధికలకు అండగా ఉండి విద్యాబుద్ధులు చెప్పించి, పెండ్లి కూడా చేసిన మనసున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అన్నారు. ట్రస్టు ద్వారా సేవ చేయడానికి ముందుకొస్తున్న ఆయనను ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓట్లు వేసి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సతీష్రెడ్డి, మనోహర్రావు, రాజమౌళి, భాస్కరాచారి, కత్తి కార్తీక, సురేశ్గౌడ్, శేఖర్గౌడ్, మహేశ్రెడ్డి, ఖలీలోద్దీన్, రాజేందర్, రహీమొద్దీన్, జ్యోతీశ్రీనివాస్గౌడ్, యాదగిరి, వెంకటేశ్వర శర్మ, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ఉద్యమాల గడ్డ దుబ్బాక
– కొత్త ప్రభాకర్రెడ్డి
ఉద్యమాల గడ్డ దుబ్బాకలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ అందిద్దామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక మొదటి నుంచి ఉద్యమ నాయకులు కేసీఆర్, హరీశ్రావు అడుగుల్లో అడుగై ముందుకు సాగిందన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలు మనకు అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థికి ఆదరణ కరువైందని, బీజేపీ అభ్యర్థికి ఆ పార్టీవారే ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోని యువతకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు.
ఎడ్లు, బండ్లు ఇస్తామని మోసం చేశారు: వెంకట్రామిరెడ్డి
గత ఎన్నికల్లో ఎడ్లు, బండ్లు, నిరుద్యోగ భృతి ఇస్తామని యవతకు బీజేపీ అభ్యర్థి మోసం చేశారని, వారికి యువత ఓటుతో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. గెలిచిన నెల రోజుల్లో రూ.100కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు అండగా ఉంటామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు ఫంక్షన్ హాళ్లు సొంత డబ్బుతో నిర్మించి పేదలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలిసి అభివృద్ధికి జోడెడ్లలా గజ్వేల్ తరహాలో దుబ్బాకను అభివృద్ధి చేస్తామన్నారు. రెండుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డికి ఘన విజయం అందించిన దుబ్బాక ఓటర్లు తనకు సైతం ఆశీస్సులు అందించాలని కోరారు.