హత్నూర, మే 2: మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చి, హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మండలంలోని దౌల్తాబాద్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ హామీలు అమలు చేయకుండా ఉన్న పథకాలను ఊడగొట్టి ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అరిగోస పడుతున్నారని తెలిపారు. పంట వేయకముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తామని చెప్పి నేడు పంటచేతికొచ్చినా రైతుబంధు ఊసే ఎత్తడం లేదన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేక కళ్లాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ అధినేత బస్సుయాత్ర చేపడితే సీఎం రేవంత్ ఎన్నులో వణుకుపుట్టిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం నాయకుడికి హోం మంత్రి ఇచ్చి గౌరవిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా ముస్లింలపై చిన్నచూపు చూపారని ఆరోపించారు. మతం పేరుతో ఒకరు, పథకాల పేరుతో ఒకరు ఓట్లడగటానికి వస్తున్నారని, వారికి ఓటు రూపంలోనే తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నిహితుడని గౌరవించి రెండుసార్లు ఎమ్మెల్యేగా మదన్రెడ్డిని గెలిపిస్తే కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి ప్రజలను మోసం చేయడం మదన్రెడ్డికే చెల్లుతుందన్నారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… ఉద్యోగం వదిలి ప్రజాసేవ చేయడానికి వస్తున్నానని, మీ మంచి మనస్సుతో ఆదరించి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ మాయమాటలు చెప్పి ప్రజలను ఓట్లు అడగడానికి వస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, దామోదర్రెడ్డి, చంద్రాగౌడ్, మన్సూర్అలీ, ఎంపీపీ నర్సింహులు, శివశంకర్ రావు, రమేశ్నాయక్, అర్జున్, కిశోర్, వీరేందర్, శ్రీకాంత్, నర్సింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, రవికుమార్, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.