‘సీఎం కేసీఆర్ మూలంగా తెలంగాణ రైతు రాజ్యంగా మారింది. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడంతోనే అన్నదాతలకు మేలు జరుగుతున్నది.ఇవాళ ఎక్కడ చూసినా గ్రామాల్లో పుట్ల కొద్ది ధాన్యం పండుతున్నది’.. అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇది చూసి ఓర్వలేని బీజేపీకి కండ్లు మండుతున్నాయన్నారు. తెలంగాణలో అంబానీ, అదానీలు లేరని, ఇక్కడ రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతున్నదని చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ట్ర రైతుల గురించి ఒక్కనాడైనా పార్లమెంటులో మాట్లాడారా? అని ప్రశ్నించారు. నిత్యం అబద్ధాలు మాట్లాడడం తప్పా, మరోటి బీజేపీ నాయకులకు తెలియదని విమర్శించారు. కాగా, భారీగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో మహాధర్నా విజయవంతమైంది.
సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట, డిసెంబర్ 23( నమస్తే తెలంగా ణ): ‘రైతుల ఓట్లతో రాజ్యమేలుతున్న ప్రధాని మోదీకి ఘోరీ క డుదాం.. తెలంగాణ ప్రాంత రైతులపై బీజేపీ కక్ష కట్టింది.. బీజేపీ అంటేనే రాబందుల పార్టీ.. ఆ పార్టీ నాయకులు ఇవాళ రైతాంగానికి సమాధానం చెబుతారు.. రైతులు కల్లాలు నిర్మించుకుంటే త ప్పా?.. వారు నిర్మించుకున్న కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాళా? రైతులపై మీకు ఎందుకు ఇంత కక్ష’.. అని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నిలదీశారు. తెలంగాణ రైతాంగంపై కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకు లు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఢిల్లీ దద్దరిల్లేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, ప్రతి ఎకరాకూ సాగు నీరందిస్తున్నారని పేర్కొన్నారు. పెరిగిన సాగు నీటి వసతులతో పంటల ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. రైతులకు కల్లాలు లేకపోవడంతో ఉపాధి హామీలో కల్లాలు నిర్మించుకున్నారని, ఇది గిట్టని బీజేపీ ప్రభుత్వం అట్టి డబ్బులు రూ.150 కోట్లు తిరిగి ఇవ్వాలని చెప్పడం దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. సిద్దిపేట వేదికగా ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు చేశామని గుర్తు చేశారు. 14 సుదీర్ఘ పోరాటం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇది చూసి ఓర్వలేని బీజేపీకి కండ్లు మండుతున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనం ప్రభుత్వంలో ఉండి ధర్నాలు చేయడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. యావత్తు దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి వారి రాష్ర్టాల్లో అమలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి గిట్టడం లేదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. ఏ విధంగానైనా బ్రేక్లు వేయాలన్న కుటిల బుద్ధితో బీజేపీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, కానీ, బీజేపీ ప్రభుత్వం అలా చేయడం లేదన్నారు. ఇవాళ కేంద్రం చేస్తున్న పని ఏంటి? ఏ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుపోతుందో దాన్ని టార్గెట్ చేసి, ఆ ప్రభుత్వాలను కూల్చే పని చేస్తున్నదని ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి తగునా అని సూటిగా ప్రశ్నించారు. దుర్మార్గపు చర్యలకు దిగుతున్న ప్రధాని మోదీ, అమిత్షాను ప్రజలు క్షమించరన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్గాలను కాపాడాలనే సంకల్పంతో పని చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమమే ఆయన ధ్యేయమని చెప్పారు. దీంతో యావత్తు దేశంలోని రైతులు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. మన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ గమనించి, తెలంగాణపై తన విషాన్ని కక్కుతున్నారని ఆరోపించారు. ఏదో ఒక వంక పెట్టి ఉపాధిహామీ నిధులు తిరిగి వాపస్ తీసుకోవడం అంటే చాలా బాధాకరమన్నారు.
పార్లమెంటులో రైతులగురించి ఎవరైనా మాట్లాడారా?
మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు తెలంగాణ రైతుల గురించి ఒక్కనాడైనా పార్లమెంటులో మాట్లాడారా? అని కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, రైతుల కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలనడం సబబేనా? అని అడిగారు. ‘మీకు ఏమాత్రం బుద్ధి, జ్ఞానమున్నా రైతుల పక్షాన పోరాటం చేయండి.. మీ ప్రభుత్వానికి చెప్పండి.. ఇది చేత కాదు గానీ, పెద్దపెద్ద మాటలు మాట్లాడడ తప్పా, మరోటి చేతకాదు’.. అని విమర్శించారు. నిత్యం అబద్ధాలు మాట్లాడడం తప్పా, మరోటి బీజేపీ నాయకులకు రాదన్నారు.
‘ఇవాళ మన జిల్లాలోనే ఓ(బీజేపీ ఎమ్మెల్యే) దుర్మార్గుడు ఉన్నాడు.. ఇక్కడి నుంచి అతన్ని పంపిస్తే, మన ప్రాంతం బాగుపడుతుంది’.. అని అన్నారు. ‘పొద్దున లేస్తే అబద్ధం.. ఏది చేసినా నేనే చేశా.. నేనే తెచ్చా అంటాడు.. లైట్ కనిపిస్తే, అదిగో దాన్ని నేనే తెచ్చా! ఇగో సీసీ రోడ్డు నాదే.. కరెంటు పోల్ నేనే తెచ్చా.. అని ఇలా నిత్యం ఎక్కడ సున్నం వేసి ఉంటే, అక్కకెళ్లి, ఇవన్నీ నేనే తెచ్చా.. అని గొప్పలు చెప్పుడు తప్పా, ఒకటి కూడా తీసుకరాడు.. ఎప్పటికి జేబులో ఓ కత్తెర పెట్టుకొని, ఎక్కడ సున్నం వేసి ఉంటే అక్కడికెళ్లి, రిబ్బన్ కట్ చేసుడే ఆయన పని అని’.. అని దుబ్బాక ఎమ్మెల్యేపై పరోక్షంగా మండిపడ్డారు. రైతుల గురించి ఒక్కనాడైనా ఆయన మాట్లాడాడా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చేస్తున్న దుర్మార్గపు పనులను మనం అరికట్టాలని కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. వాళ్ల అబద్ధాలను బీఆర్ఎస్ నాయకులు తిప్పి కొట్టాలన్నారు.
రైతులకు ఎంతో మేలు
తెలంగాణ రాష్ట్రంలో అంబానీలు, అదానీలు లేరని, ఇక్కడ రైతు రాజ్యం ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రైతులు కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడంతోనే రైతులకు ఇంత మంచి మేలు జరుగుతున్నదని చెప్పారు. ఇవాళ ఎక్కడ చూసినా గ్రామాల్లో పుట్ల కొద్ది ధాన్యం పండుతున్నదన్నారు. చివరకు రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే, తన రాష్ట్ర రైతులకు ఇబ్బందులు కలుగొద్దని, రాష్ట్రంపై ఎంత భారం పడ్డా సరే, ప్రతి గింజా కొని, 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అంటేనే రైతుల ప్రభుత్వమన్నారు. ధాన్యం పండుతున్నదని రైతులు కల్లాలు కట్టుకుంటే, అవి తమ ఎజెండాలో లేవని చెప్పడం, కట్టుకున్న కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వ మూర్ఖత్వాన్ని తెలియజేస్తున్నదని చెప్పారు.
పచ్చని తెలంగాణను చూసి ఓర్వలేక..
పచ్చబడ్డ తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు ఆందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ అందించాలనే బీఆర్ఎస్ స్థాపించడంతో బీజేపీలో వణుకు మొదలైంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినా కేంద్రం వినిపించుకోలేదు. రైతులు కట్టుకున్న కల్లాల డబ్బులు వాపస్ ఇవ్వమనడం కేంద్రం చేస్తున్న మరో కుట్ర.. దీనిని తిప్పికొట్టే వరకు విశ్రమించొద్దు. రైతులను సీఎం కేసీఆర్కు దూరం చేయాలనే మోదీ ప్రభుత్వం పన్నాగాన్ని తిప్పికొట్టాలి.
– వంగనాగిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు
బీజేపీ నాయకులను ఊర్లలో తిరుగనీయొద్దు
రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదనే సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం, రైతుబంధు, బీమా, 24గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాడు. పచ్చబడ్డ తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్రం తెలంగాణపై కక్ష కట్టింది. రైతులు నిర్మించుకున్న కల్లాలకు పైసలు వాపసు ఇచ్చేది లేదు. కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు బీజేపీ నాయకులను ఊర్లర్ల తిరుగనీయొద్దు.
– ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్సీ
బీజేపీ చర్యలను ఎండగట్టాలి
బీజేపీ రైతు వ్యతిరేక నిర్ణయాలను గ్రామగ్రామాన బీఆర్ఎస్ కార్యర్తలు ఎండగట్టాలి. కల్లాల నిర్మించుకున్న నిధులు వాపస్ చేయమనడం దుర్మార్గం. నల్లా చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల్లా మనం పోరాడాలి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువును పారద్రోలి, పచ్చని పంటలతో కళకళలాడుతన్న తెలంగాణ చూసి కేంద్రం కండ్లు మండుతున్నాయి. హుస్నాబాద్ ప్రాంత రైతుల కోసం నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టుతో 70 ఏండ్ల గోస తీరింది.
– రాయిరెడ్డి రాజిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్
కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేదు..
దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ వివిధ పథకాలు అమలు అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఉపాధిహామీని ఎక్కువగా వాడుకుం టున్నది. ఇది చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కండ్లు మండుతున్నాయి. రైతులు నిర్మించుకున్న కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలనడం సరికాదు. రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న కల్లాలపై బీజేపీ రాజకీయం చేయడం కేంద్ర ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. బీజేపీ ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ రైతాంగం ఎండగట్టాలి.
– చిట్టి దేవేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతు ఉద్యమం
తెలంగాణ ఉద్యమ తరహాలో రైతుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి మనం సిద్ధం కావాలి. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పడు తిప్పి కొట్టాలి. రాష్ట్రంలో కుట్రలు చేసేందుకు చంద్రబాబును కేంద్రం తెలంగాణపై ఉసిగొల్పుతున్నది. ప్రదాని మోదీ తెలంగాణ వ్యతిరేకి. అందుకే పలుమార్లు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పడు అభివృద్ధిలో ముందున్న తెలంగాణను ,సీఎం కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనే కేంద్రం కుట్రలు చేస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని మోదీ అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. కల్లాలపై కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమ స్ఫూర్తితో పోరాడి కేంద్రానికి గుణపాఠం చెబుదాం.- యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
రైతుల నడ్డివిరిచేలా కేంద్రం నిర్ణయం
కల్లాలు నిర్మించుకున్న డబ్బులు రూ.150 కోట్లు వాపసు ఇవ్వమనే నిర్ణయం రైతుల నడ్డివిరిచేలా ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందిపడకూడదనే సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి, వారిని బాగు చేస్తున్నారు. కోలుకుంటున్న తెలంగాణను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తున్నది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. రైతు ఎజెండాతో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నది. కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమించాలి. – వేలేటీ రోజాశర్మ, జడ్పీ వైస్ చైర్మన్
కల్లాలు నిర్మించుకుంటే కండ్ల మంటనా?
రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచేదాకా మన పోరాటాన్ని కొనసాగించాలి. రైతులు కల్లాలు నిర్మించుకుంటే అది చూసి ఓర్వని ప్రభుత్వం ఓ ప్రభుత్వమేనా? మా రైతులపై ఎందుకంత కడుపు మంట. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఇప్పుడిప్పుడే మంచి రోజులు వచ్చాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ పంటలు పండుతున్నాయి. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి వ్యవసాయానికి పండుగలా సీఎం కేసీఆర్ చేశారు. ఇది చూసి ఓర్వని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కండ్లు మండుతున్నాయి.
– మాదాస్ శ్రీనివాస్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్