మద్దూరు (ధూళిమిట్ట), మార్చి 30: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంద యాదగిరి మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటిపోవడంలో పంట లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం చెరువు, కుంటలను గోదావరి జలాలతో నింపాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన పంటలను సర్వే చేయాలన్నారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఉపసర్పంచ్ ఇస్లావత్ రమేశ్, నాయకులు ఎనగందుల యాదగిరి, బాకి మొగిలి, లింగాల సంపత్, మంద యాదయ్య, బావు మొగిలి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.