సిద్దిపేట, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘చలో నల్లగొండ’ సభకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మహారెడ్డి భూపాల్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు కదిలివెళ్లి జంగ్ సైరన్ మోగించారు. శాసనసభ ఎన్నికల తర్వాత తొలి సభ నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన తొలి సభకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి విజయవంతం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో సభలకు వెళ్లిన పార్టీ క్యాడర్ పదేండ్ల తర్వాత మళ్లీ ఉద్యమ సభకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. ప్రధానంగా కరెంట్, సాగునీటి, తాగునీటి తదితర వాటిపై ఫోకస్ పెట్టనున్నది. ప్రజల పక్షనా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ యంత్రాంగం సిద్ధ్దమవుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ స్థానాలు గెలిపించుకొని బీఆర్ఎస్ సత్తా చూపడానికి పార్టీ సిద్ధమవుతున్నది. నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం పార్టీ క్యాడర్లో జోష్ను నింపింది. పార్టీ క్యాడర్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది.శాసనసభ ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలి స్పీచ్ రైతులను బాగా ఆకట్టుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎక్కడికక్కడ నిలదీయడానికి నల్లగొండ సభతో బీఆర్ఎస్ శ్రీకారం చుట్టగా.. ముందు ముందు ఉద్యమాలకు పురిటిగడ్డ మెతుకుసీమ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ హయాంలో కాలయాపన తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల హక్కులు, రాష్ట్ర వనరులను కాపాడేందుకు మరో ఉద్యమం ప్రారంభమైంది. నల్గొండలో కేసీఆర్ నిర్వహించిన సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణలో కరెంట్, సాగునీరు, జలవనరుల సంరక్షణ, సాధన కోసం కేసీఆర్ పార్టీ శ్రేణులను చైతన్యపరిచారు. సామాన్య ప్రజలు, రైతుల కోసం ఆయన ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. కృష్ణా నది జలాలను కేంద్రానికి అప్పగించకుండా ఎంతటి పోరాటాలకైన సిద్ధం.
అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ప్రజలకు విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. నల్గొండలో నిర్వహించిన బహిరంగసభ విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ నది నీటి పంపకాలను కేంద్రానికి అప్పగించిన విషయాన్ని కేసీఆర్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో సభలో తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతలా కృషి చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసు. కేసీఆర్పై ప్రజలకు ఇంకా నమ్మకం, విశ్వాసం ఉందనేది ఈ సభ విజయవంతమే తార్కాణం.
తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీపై వాస్తవాలు మాట్లాడాలి. తప్పుడు సమాచారాన్ని పదే పదే చెప్పి అవే వాస్తవాలని మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నల్గొండ సభలో కేసీఆర్ రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని, హక్కుల సాధనకు కలిసికట్టుగా నడవాల్సిన బాధ్యత ఉందని దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీపై అనుభవజ్ఞులైన వారిని ప్రభుత్వం తరుపున మంత్రులు సంప్రదించాలి. కేసీఆర్ చెప్పినట్లు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర హక్కులకు సంబంధించిన అంశాలను చర్చించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సభను నిర్వహించారు.
కేసీఆర్ నాయకత్వంలో కేఆర్ఎంబీపై మరో పోరాటానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం. నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన అంశాలపై ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉంది. నల్గొండలో సభ పెట్టడానికి ముందు రోజే అసెంబ్లీలో అత్యవసర తీర్మానం ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరినం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో చిన్నపాటి సమస్యలను భూతద్ధంలో చూపించడం పక్కనే పెట్టి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కట్టిన ప్రాజెక్టులను ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి.
అస్తవ్యస్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనతో ఆందోళన చెందుతున్న ప్రజలకు నల్లగొండ సభతో మాజీ సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. బీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి ఏ నాయకుడికీ, పార్టీకి లేదనే విషయం కేఆర్ఎంబీ అంశంతో తేలిపోయింది. తొమ్మిదిన్నరేండ్లు కేఆర్ఎంబీ విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించిన తీరు, అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రజలకు అర్థమైంది. ఆరు గ్యారెంటీల అమలు, రైతుబంధు, 24 గంటల విద్యుత్ను పట్టించుకోకుండా బీఆర్ఎస్, కేసీఆర్పై బురదజల్లుతున్న కాంగ్రెస్కు నల్లగొండ సభ ద్వారా హెచ్చరిక జారీ చేశారు. కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామనే ఆవేదనలో ఉన్న ప్రజల్లో నల్లగొండ సభ ఉత్సాహం నింపింది.
నల్గొండలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఉద్యమ స్ఫూర్తిని చా టింది. బహిరంగ సభ కు హాజరైన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చెప్పా రు. కృష్ణాబోర్డుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషప్రచారం, కాళేశ్వరంపై చేస్తున్న హంగామాను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తెలిపారు. ఒక మేడిగడ్డ పిల్లర్ కుంగితే లక్ష కోట్లు వృథా అయ్యాయనే అబద్ధాలను ప్రజలు గమనించేలా చేశారు. మేడిగడ్డ బరాజ్కే లక్ష కోట్లు అయ్యాయా..? మిగతా బరాజ్లు, రిజర్వాయర్లు, కాల్వలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కావా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. అధికారంలోకి వచ్చాక కృష్ణాబోర్డుకు కృష్ణా జలాల అధికారాన్ని కట్టబెట్టింది కాంగ్రెస్యేనని, దీని వల్ల హైదరాబాద్ సహా ఐదు జిల్లాలు ఎడారిగా మారిపోతాయనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమయింది. మొత్తం మీద నల్గొండ సభ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
అబద్ధాలతో ప్రజలను మోసం చేసి, ఆరు గ్యారెంటీల పేరుతో వంచించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వలేదు. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు లేకున్నా నోటిమాటలతో సరిపెడుతున్నది. రైతులకు పెట్టుబడి సాయం నేటికీ అందక అన్నదాతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దోచుకుని దాచుకునే సాంప్రదాయం ఉన్న పార్టీ. నల్లగొండ ప్రజలకు తాగు, సాగునీటి సమస్య రాకుండా చేసిన ఘనత బీఆర్ఎస్దే.
చలో నల్గొండ సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడిచినా ఇంతవరకు రైతుబంధు ఇవ్వలేదు. పింఛన్ డబ్బులు వేయలేదు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 420 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజలు, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్రావు అనేక సమస్యల మీద మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా నోరు విప్పలేదు.
నల్లగొండ సభకు వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వణుకు మొదలైంది. అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోమంటూ కేసీఆర్ గర్జించడంతో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ సాధించి, పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సొంతం. నల్లగొండ సభతో కేసీఆర్, బీఆర్ఎస్పై పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో మరింత నమ్మకం పెరిగింది.