సంగారెడ్డి జనవరి 2,(నమస్తే తెలంగాణ): తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో సంగారెడ్డి జిల్లాలో 444, మెదక్ జిల్లాలో 256 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున సాయం అందజేసింది. ప్రభుత్వ సహకారంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, లారీలు, గొర్రెలు, సూపర్బజార్లు, పౌల్ట్రీఫాంలు, డెయిరీ ఫాంలు తదితర వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా యూనిట్లు రన్ చేస్తున్నారు. రెండో విడత ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ఎన్నికల కోడ్ రావడం.. ఎలక్షన్లలో గెలిచిన కాంగ్రెస్ దళిత బంధు పథకాన్ని ‘అంబేద్కర్ అభయహస్తం’గా మార్చి జీవనోపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు సెకండ్ ఫేజ్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో దళితుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రెండో దశలో అయినా తమ పేరు ఉంటుందని భావించిన ఎంతోమంది అయోమయంలో పడిపోయారు.
గత కేసీఆర్ ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపి వారు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటి విడత విజయవంతంగా లబ్ధిదారులంతా ఆనం దం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందింది. తమ జీవితాలను మార్చే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న దళితులు రోజువారీ కూలీల నుంచి యజమానులుగా మారారు. ఎంతో మందికి ఉపాధి కల్పి స్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 256 యూనిట్లు మంజూరు కాగా, 255 యూనిట్లకు సంబంధించి డెయిరీ షెడ్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పాడి గేదెలు తదితర వ్యాపార మార్గాలను ఎంచుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం యూనిట్లను గ్రౌండింగ్ చేసింది.
రెండో విడత గల్లంతేనా ?
కేసీఆర్ సర్కార్ అమలు చేసిన దళితబంధు పథకం రెండో విడత కోసం దళిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అయితే గత సర్కారు హయాంలో ఒక్కో దళిత కుటుంబానికీ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయగా, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితబంధు పథకాన్ని అంబేద్కర్ అభయహస్తం పేరుతో దళితులకు జీవనోపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చింది. అయితే, రెండో విడతలో మెదక్ జిల్లాలో సుమారుగా 3వేల మంది దళితులకు దళితబంధు అమలు చేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో దానికి బ్రేక్ పడింది. అప్పటికే జిల్లావ్యాప్తంగా 1200 మంది లబ్ధిదారులను గుర్తించినప్పటికీ మంజూరు చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో, రెండో విడుత ప్రక్రియ మళ్లీ ఎప్పుడు మొదలువుతుందోనని ఎదురుచూస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 5500 మంది ఎదురుచూపు
దళితుల తలరాత మార్చిన దళితబంధు పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేసీఆర్ సర్కార్ దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడత దళితబంధు పథకంతో సంగారెడ్డి జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. దీంతో కేసీఆర్ సర్కార్ రెండోవిడత దళితబంధు అమలుకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రెండోవిడతలో 1100 మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అందోలు, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మొత్తం 5500 మంది లబ్ధిదారులకు రెండో విడత దళితబంధు అమలుచేసేందుకు కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకున్నది.
రెండోవిడత దళితబంధు పథకం అమలుకు నిధులు విడుదల చేయటంతోపాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. అయితే ఎన్నికలు రావడంతో రెండోవిడత దళితబంధు పథకం అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికలు ముగిసిన తర్వాత దళితబంధు పథకం అమలువుతుందని జిల్లాలోని దళితులు ఎదురుచూశారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితబంధు పథకం అమలును పట్టించుకోవటం లేదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళితబంధు పథకానికి బ్రేక్ వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం రెండోవిడత దళితబంధు అమలుకు చర్యలు ప్రారంభించ లేదు. దళితబంధు అమలుకు అవసరమైన నిధులు ఉండడంతోపాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కివచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు పథకం అమలుకు చేయటం లేదు. దీంతో దళితులు, దళితం సంఘాలు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి విడత విజయవంతంగా..
మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్, ఆందోల్, దుబ్బాక, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 256 మందికి మొదటి విడతలో దళితబంధు అవకాశం దక్కింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున, అలాగే ఆందోల్ నియోజకవర్గంలోని హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 256 మందికి ఎంపిక చేసిన యూనిట్లు అందజేశారు. మెదక్ నియోజకవర్గంలోని హవేళీఘణపూర్ మండలం జక్కన్నపేటలో 20 మంది, మెదక్ మండలంలో కొంటూర్లో 20, నిజాంపేట మండలం రాంపూర్లో18, పాన్నపేట మండలం అబ్లాపూర్లో 18, రామాయంపేట మండలం శివ్వాయిపల్లిలో 7, చిన్నశంకరంపేట మండలం చందంపేటలో 17 మొత్తం 100 మందిని ఎంపిక చేశారు. అలాగే, నర్సాపూర్ నియోజకవర్గంలో కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (బీ)లో 34, చిలిపిచెడ్ మండలం రాందాస్గూడలో 2, నర్సాపూర్ మండలం తిర్మలాపూర్లో 21, శివ్వంపేట మండలం తిమ్మాపూర్లో 18, వెల్దుర్తి మండలం రామంతాపూర్లో 23 మందికి వివిధ యూనిట్లు అందజేశారు. అయితే, ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలంలోని అసద్మహ్మద్పల్లికి 56 యూనిట్లు మంజూరుచేయగా, ఇందులో అధికంగా 13 మంది లబ్ధిదారులు డెయిరీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆరు ట్రాక్టర్లు, ఒక హార్వెస్టర్, మూడు అశోక్ లెల్యాండ్, ఐదు గొర్రెలు, ఒకటి మినీ సూపర్బజార్, ఒక ఫర్టిలైజర్ షాపు, మూడు పౌల్ట్రీఫాంలు, మూడు బట్టల దుకాణాలు ఇలా రకరకాల ఉపాధినిచ్చే యూనిట్లను ఏర్పాటు చేసుకుని కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.
మొదటి విడతలో 444 మందికి లబ్ధి
దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ సర్కార్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతిఒక్కరికీ రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేసింది. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత 444 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం వర్తింపజేసింది. సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజవర్గాల్లో వందమంది చొప్పున లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని అందజేసింది. దళితబంధు డబ్బులతో లబ్ధిదారులు మినీ డెయిరీలు, వాహనాలు, జేసీబీలు, కంకర మిషన్లు, కిరాణషాపులు, బట్టల షాపులు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడుతున్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గంలో 1100 దళితబంధు యూనిట్లను కేసీఆర్ సర్కార్ మంజూరు చేసింది. సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల్లో మొత్తం 5500 యూనిట్ల గ్రౌండింగ్కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ప్రతి నియోజకవర్గాల్లో రెండో విడత దళితబంధు కోసం దరఖాస్తులు తీసుకోవడంతోపాటు 5500 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఎన్నికల కోడ్ కారణంగా రెండో విడత దళితబంధు పథకం అమలులో జాప్యం చోటుచేసుకుంది. ఎన్నికల ముగిసిన అనంతరం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుతీరినప్పటికీ ఇప్పటివరకు రెండోవిడత దళితబందు పథకం అమలు చేయటం లేదు. రెండో విడత దళితబంధుకు అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభత్వుం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దళితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తమ నోటికాడికి వచ్చిన ముద్దను కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్నా..
దళితబంధు వస్తే ట్రాక్టర్ కొందామని ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నేను వ్యవసాయం చేస్తా ట్రాక్టర్ ఉంటే నాకు ఎంతో ఉపయోగపడేది. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడంతో రెండో విడత జాప్యం జరుగుతున్నది. మేము కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే దరఖాస్తులు చేసుకున్నా. ఈ లోగా ఎన్నికల కోడ్ రావడం.. ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ప్రస్తుతం కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు దళితబంధు కింద సాయం అందజేసి సీఎం రేవంత్రెడ్డి ఆదుకోవాలి.
-గావు ప్రభాకర్, రామాయంపేట
సెంట్రింగ్ వ్యాపారం చేయాలనుకున్నా..
సెంట్రింగ్ వ్యాపారం దళితబంధుకు దరఖాస్తు చేసుకున్నా. రూ.10లక్షలు వస్తే సెంట్రింగ్ మెటీరియల్ తీసుకోవచ్చని గంపెడాశతో ఉన్నా. నేను దరఖాస్తు చేసుకుని మూడు నెలలు కావస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడంతో మాకు వచ్చే దళితబంధు డబ్బులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పెద్దలు దళితబంధు ఇప్పించాలని కోరుతున్నా. దళితబంధు రాకుంటే జీవితాంతం కూలీ పనులు చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు.
-కందరి కాశీనాథ్, రామాయంపేట