‘అందోల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. ఇక్కడ గులాబీ జెండాను ఎదిరించి నిలబడే సత్తా ఏ పార్టీకీ లేదని ప్రతిపక్షాలకు ఇప్పటికే అర్థమైంది’, అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. వట్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ బీబీ పాటిల్తో కలిసి ఆయన హాజరయ్యారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వ పథకం అందని ఇల్లేదైనా ఉందేమో చూపించాలని కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరారు. మూడోసారీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలన్నారు. బసవేశ్వర, సంగమేశ్వరం ఎత్తిపోతల పూరైతే నియోజకవర్గంలోని భూములన్నీ సస్యశ్యామలం అవుతాయన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
– అందోల్/ వట్పల్లి మే 26
అందోల్/ వట్పల్లి, మే 26: “అందోల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.., మళ్లీ రాష్ట్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే., అందోల్ నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండానే..” అని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం వట్పల్లిలో బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు తెలంగాణ అమరులకు నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని వారి ఆశీర్వాదమే నన్ను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపించిందని గుర్తు చేశారు. రెండోసారి గెలిపించేందుకూ వారు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ను ఎదిరించి నిలిచే పార్టీ అందోల్లో లేదని, అందోల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ప్రతిపక్షాలకు ఇప్పటికే అర్థమైందన్నారు.
గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కండ్ల ముందు కనబడుతుంటే, తమ ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని విమర్శించారు. పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ప్రతిపక్షాల అసత్యా ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయని, ఇదంతా సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు తమ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉందన్నారు. 9 ఏండ్ల పాలనలో ప్రభుత్వ పథకం పొందని ఇల్లు ఏదైనా ఉందేమో చెప్పాలని, ఇంత అభివృద్ధి మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా జరిగిందా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మార్గ నిర్దేశంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, స్థానికుడిగా ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటున్నానన్నారు. రాష్ర్టానికి కేసీఆర్ సేవలు అవసరమని, మీ అందరి దీవెనలు ఆయనపై ఉండాలని, మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలన్నారు.
తాలెల్మ ఎత్తిపోతలతో అందోల్, వట్పల్లి, టేక్మాల్ మండల్లాలోన్ని కొన్ని వేల ఎకరాల భూములు సస్యశ్యామలమయ్యాయని, బసవేశ్వర-సంగమేశ్వర పూర్తి చేసుకుంటే అందోల్ నియోజకవర్గంలో భూములన్నీ పచ్చని పంటలతో దర్శనమిస్తాయన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికే గుర్తింపు ఉంటుందని, పార్టీకి ద్రోహం చేసేవారెవరైనా ఉపేక్షించేదిలేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భిక్షపతి, స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఎంపీపీ కృష్ణవేణి, సర్పంచ్ సురేఖాబుద్దిరెడ్డి, ఎంపీటీసీ ఇందిర, వరం చైర్మన్ వీరారెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు అశోక్గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్, మున్పిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ ఎంపీపీ నాగరాణి బస్వరాజ్, నాయకులు ప్రతాప్లింగాగౌడ్, నారాయణ, కాశీనాథ్, మైనార్టీ అధ్యక్షుడు శాబోద్ధీన్, కుత్భోద్ధీన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
గులాబీ వనమైన వట్పల్లి..
వట్పల్లి, మే 26: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో వట్పల్లి మండలం గులాబీ వనమైంది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గులాబీ ప్రభంజనాన్ని తలపిస్తుందన్నారు. మార్కెట్ యార్డు నుంచి ర్యాలీగా డీజే పాటలు, డోలు చప్పుళ్లతో, కార్యకర్తలు స్టెప్పులు వేస్తూ, గుర్రాల నృత్యాలు, కార్యర్తలు ఎమ్మెల్యేకు పూలవర్షం కురిపించారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి, శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే పులమాల వేశారు. అనంతరం కార్యకర్తలు ఎమ్మెల్యేకు భారీ గజమాలతో సత్కరించారు. కార్యకర్తల కోరిక మేరకు ఎమ్మెల్యే గుర్రంపై సభా ప్రాంగణానికి రావాడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. సభలో కళాకారుల నృత్యాలు సైతం పలువురిని ఆకర్షించాయి.
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
– జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్
దేశ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎంపీ బీబీపాటిల్ అన్నారు. అవినీతి రహిత పాలనే కేసీఆర్ లక్ష్యమని కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వారి స్వప్రయోజనాల కోసం ప్రజలను ఉపయోగించుకుంటున్నారే తప్ప, వారికి ఉపయోగపడే పని ఒక్కటీ చేయరన్నారు. రెండు పార్టీలు ఇన్నేండ్లుగా చేయలేని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లలోనే చేసిందని, ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదన్నారు. మిషన్ భగీరథతో తాగునీరు, మిషన్ కాకతీయతో సాగునీరందించిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు.