సంగారెడ్డి, మార్చి 10: పవిత్ర రంజాన్ మాసంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు పెరగడంతో పండుగ వేళ ముస్లిములపై తీవ్ర ప్రభావం చూపుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందుకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో హరీశ్రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన్నీరు హరీశ్రావు మాట్లాడుతూ.. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, త్వరగా యుద్ధం ముగిసి శాంతి వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఈ నెలలో ముస్ల్లింలు చేసే ప్రార్థనలు, ఉపవాసాలు సమాజంలో శాంతి మార్గం చూపుతాయన్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లోని పరిస్థితులు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని, యుద్ధంలో నిరపరాధ చిన్నారులు, సామాన్య ప్రజలు అసువులు బాయడం, అమాయక ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తే బాధేస్తున్నదని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ముస్లిముల అభ్యున్నతికి బీఆర్ఎస్ సర్కారు ఎంతో కృషి చేసిందన్నారు. మైనారిటీ గురుకులాల్లో విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తాను ముస్లిములకు అన్నివిధాలుగా అండగా ఉంటానని హరీశ్రావు భరోసా ఇచ్చారు. ఇఫ్తార్ విందులో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, నాయకులు ముఖీమ్, రాజేందర్, షేక్ సాబెర్, జైపాల్రెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు, గడీల శ్రీకాంత్, అజామ్, వాజిద్, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.