దుబ్బాక/దుబ్బాక టౌన్, నవంబర్ 25: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకకు వస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉండగా దుబ్బాకలో జరిగే ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దుబ్బాకలో బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో బీఆర్ఎస్ ఈ నియోజకర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఏర్పడ్డ ఉప ఎన్నికలో కొద్దిపాటి తేడాతో ఓటమి పొందిన బీఆర్ఎస్ ఈసారి భారీ మెజార్టీతో విజయాన్ని అందుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. గత ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ దుబ్బాకలో పర్యటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మంత్రి హరీశ్రావు ఇటీవల దుబ్బాక పర్యటనలో మాట్లాడటం గమనార్హం. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ దుబ్బాక పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యమ గడ్డతో పాటు బీఆర్ఎస్కు కంచుకోటైన దుబ్బాక పర్యటనతో ఈసారి బీఆర్ఎస్ ఘన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ప్రజలు చర్చించుకుంటున్నారు. తాను పుట్టి పెరిగి ఓనమాలు నేర్చుకున్న దుబ్బాకపై ఉన్న ప్రేమతో సీఎం కేసీఆర్ దుబ్బాక అభివృద్ధికి వరాలు అందించి ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఎన్నికల ముఖ్య ఘట్టమైన ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో గులాబీ దళపతి పాల్గొంటున్న దుబ్బాక ఆశీర్వాదసభ సభను విజయవంతం చేసేందుకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నిమగ్నమై పనులను పర్యవేక్షిస్తున్నారు.
నేడు సీఎం పర్యటన నేపథ్యంలో దుబ్బాక గులాబీమయంగా మారింది. కనివిని ఎరుగని రీతిలో ఆశీర్వాద సభను నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు నిమగ్నమయ్యారు. వాతావరణం సైతం అనుకూలిస్తుండటంతో సభ ఏర్పాట్లన్ని సజావుగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రజాఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలను, ప్రజలను తరలించేందుకు పక్కా ప్లాన్ చేశారు. దుబ్బాకలోని దుంపలపల్లి రోడ్డులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో గల మైదానంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 50 వేలకు మందికి పైగా ప్రజలు సభకు హాజరవుతారని ఎంపీ తెలిపారు. సభా ప్రాంగణానికి సమీపంలోనే ప్రత్యేక హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజల కోసం కుర్చీలతో పాటు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పోలీసు అధికారులు సైతం సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు.
దుబ్బాకలో సీఎం కేసీఆర్ చేపట్టే ప్రజా ఆశీర్వాద సభకు ఎంపీ కొత్త ప్రభాకరెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీంతో దుబ్బాక పట్టణమంతా గులాబీమయంగా మారింది. 2009, 2014 ఎన్నికల ప్రచారాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 2015లో పర్యటించిన సీఎం కేసీఆర్ దుబ్బాకకు వరాల జల్లు కురిపించారు. ఈ ఆశీర్వాద సభలో మరిన్ని వరాలు కురిపించి దుబ్బాక తలరాతను మారుస్తాడని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిన దుబ్బాక ప్రాంతం బీఆర్ఎస్కు మొదటి నుంచి పెట్టని కోటగా ఉంది. ఈ ప్రాంతంలో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు దోహదపడుతుందని పార్టీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ నిర్వహించిన రోడ్షోలతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో ‘కొత్త’ జోష్ నింపింది. నేడు జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో దుబ్బాక తలరాత మారనుందని ప్రజలు నమ్ముతున్నారు.