హత్నూర, ఏప్రిల్ 12: ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వచ్చే పార్టీలను నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, అధికారం చేపట్టాక పథకాల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. నేడు ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే సమస్యలు గాలికి వదిలేసి మళ్లీ కొత్త నినాదంతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడగటానికి వస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలు మర్చిన కాంగ్రెస్కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మతం పేరుతో ఒకరు, కులం పేరుతో మరొకరు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, అలాంటి పార్టీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గతంతో కలెక్టర్గా చేసిన అనుభవంతో ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి అని, అలాంటి విద్యావేత్తను పార్లమెంట్కు పంపిస్తే ప్రజల గొంతుకగా ప్రభుత్వాలను నిలదీసి ప్రజల పక్షాన నిలబడతాడని తెలిపారు.
ప్రజాసేవ చేయడానికే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. తన కుటుంబీకుల సహకారంతో రూ.100కోట్లతో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గానికి ఫంక్షన్ హాల్ నిర్మాణంతో పాటు విద్యార్థులకు నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్, హరీశ్రావు ఆశీస్సులతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ నర్సింహులు, దేవేందర్రెడ్డి, చంద్రాగౌడ్, గోపి, హరికృష్ణ, దామోదర్రెడ్డి, శివశంకర్రావు, రవికుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.