మెదక్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని ప్రభంజనంలా కొనసాగిస్తున్నారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటామని ముక్తకంఠంతో భరోసా ఇస్తున్నారు.
ఏ గ్రామానికి, ఏ తండాకు వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు మూకుమ్ముడిగా బీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలిచారు. సబ్బండ వర్గాల ప్రజలు ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. పద్మాదేవేందర్రెడ్డి యువతతో పాటు వృద్ధులు, మహిళలు ఇలా అందరినీ కలుస్తూ, పలుకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టి, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఓపికగా వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని కోరుతున్నారు. దేశంలో ఎకడాలేని విధంగా సంక్షేమ పథకాల అమలుతో పాటు వెనుకబడిన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే మా ఓటు అంటూ పద్మాదేవేందర్రెడ్డికి జనం నీరాజనాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు, రైతులు మోసపొవద్దని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఎన్నికల మ్యానిఫెస్టో, సంక్షేమ పథకాలు, తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని పద్మాదేవేందర్రెడ్డి కోరుతున్నారు.
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా బీఆర్ఎస్లో చేరడంతోనే మెదక్లో గులాబీ జెండా ఎగురడం పకా అని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం, సబ్బండ వర్గాల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంతో అభివృద్ధివైపే తాముంటామంటూ నియోజకవర్గ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారు. ఇప్పటికే కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి రోహిత్ను తరిమికొట్టేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. మెదక్ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని విమర్శిస్తున్న మైనంపల్లి రోహిత్కు నియోజకవర్గంలో కాలం చెల్లినట్టేనంటున్నారు. రోహిత్ మా తండాకు ప్రచారానికి వస్తే తరిమికొడుతామని గిరిజన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వెనుకబడిన తండాలను పంచాయతీలుగా మార్చి, మా జీవితాల్లో వెలుగులు నింపిన ‘ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కే’ మా ఓటంటూ ప్రజలు వెల్లువలా మద్దతిస్తున్నారు.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తున్నది. నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను విడుదల చేసింది. పలు అభివృద్ధి పనులు చేసింది. అదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ముఖ్య ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని రామాయంపేట, నిజాంపేట, పాపన్నపేట, హవేళీఘనపూర్, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల్లో ఎకడ ప్రచారం నిర్వహించినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు.