సంగారెడ్డి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్పై గురిపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ స్థానాన్ని గెలవడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ తరఫున గాలి అనిల్కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీపాటిల్ బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో గెలుపు కోసం బీఆర్ఎస్ కార్యాచరణను సిద్ధం చేసింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టడంపై బీఆర్ఎస్ దృష్టిపెట్టింది.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాల్లో ప్రజల మద్దతు కూడగట్టే పని బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఎన్నికల ప్రచారంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఆయ న సమావేశమవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాం తికిరణ్, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ నాయకులతోనూ సమావేశం అవుతున్నారు. నియోజకవర్గస్థాయి ముఖ్యనేతలతో సమావేశాలు ముగియడంతో మూడురోజులుగా మండలస్థాయి నాయకులతో గాలి అనిల్కుమార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. అల్లాదుర్గం మండల నాయకులతో సమావేశమయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మండలస్థాయి నాయకులతో గాలి అనిల్కుమార్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ అంతా గెలుపు కోసం పనిచేయాలని కోరుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు పదేండ్లలో జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు, ప్రాజెక్టులు మంజూ రు చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. గ్యారంటీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గాలి అనిల్కుమార్ సిద్ధమవుతున్నారు. కాం గ్రెస్ పాలనలో ప్రధానంగా రైతులకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. కరెంటు కోతలు, సాగునీటి కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు పూర్తిగా పడలేదు. పంట రుణమాఫీ అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన పలు హామీలు, పథకాలు ప్రారంభం కాలేదు. దీంతో కాంగ్రెస్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాలి అనిల్కుమార్ సమాయత్తం అవుతున్నారు.
కేసీఆర్ పాలనలో జహీరాబాద్ పార్లమెంట్లో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజెప్పనున్నట్లు గాలి అనిల్కుమార్ తెలిపారు. కేసీఆర్ సర్కార్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి బాటలు వేసింది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా జహీరాబాద్లో నిమ్జ్లో మౌలిక వసతులకు నిధులు మంజూరు చేసింది. నిమ్జ్లో పెద్దఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కృషి చేసింది. జహీరాబాద్లో పారిశ్రామిక కేంద్రంగా, ఆటోమొబైల్ హబ్గా కేసీఆర్ సర్కార్ మార్చింది. జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కేసీఆర్ సర్కార్ పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ విషయాలను గాలి అనిల్కుమార్ ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.