జనగామ/ములుగు/మహబూబాబాద్/జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/హనుమకొండ/ఓసిటీ, ఆగస్టు 17: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026)లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 26,77,480 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 13,13,562, మహిళలు 13,63,723, ఇతరులు 195 ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 50,161 మంది అధికంగా ఉన్నారు. కాగా, అర్హత కలిగిన పౌరుల పేరు ముసాయిదా జాబితాలో లేకపోయినా, ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు, మార్పులున్నా నిర్ణీత గడువులోగా సంబంధిత దావాలు, అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు.
కాగా జాబితాలో పేరు లేని వారు, కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారి కోసం సెప్టెంబర్ 16 వరకు అవకాశం కల్పించారు. కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ఫారం-6, నమోదుపై అభ్యంతరం లేదా పేరు తొలగింపునకు ఫారం-7, ఓటరు వివరాల్లో సవరణలు చేసుకోవడానికి లేదా నివాసం మారిన సందర్భంలో మార్పు కోసం ఫారం-8ను ఉపయోగించుకోవచ్చని పేరొన్నారు. అలాగే నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ అభ్యంతరాలను నేరుగా తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారి (బీఎల్వో)కి, అలాగే ఈసీఐనెట్ యాప్ లేదా ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా, ఆఫ్లైన్లో దావాలు, అభ్యంతరాలను ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో సమర్పించవచ్చన్నారు.
అర్హులైన ప్రతి ఒకరూ తమ పేరు, వివరాలను పరిశీలించుకుని అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అన్ని దరఖాస్తులు, అభ్యంతరాలు, అప్పీళ్ల పరిశీలన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు. కాగా, హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల పరిధిలో ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించలేకపోవడం, ఇతర కారణాలతో ముసాయిదా జాబితా నుంచి 1,01,697 మంది ఓటర్లు (19.98 శాతం) తొలగించారు. ఇందులో 14,757 మంది మరణించినవారు, 77,054 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 8,502 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనవారు ఉన్నారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు మంథని పరిధిలోని మహదేవపూర్, కాటారం, మల్హర్, పలిమెల, మహాముత్తారం మండలాలు కలుపుకొని జిల్లాలో పురుష ఓటర్లు 1,65,690, మహిళలు 1,71,820, ఇతరులు 14 మంది, మొత్తం 3,37,515 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
