కంది, మే 24: మండలంలో కృత్రిమ ఇసుక దందా జోరుగా సాగుతున్నది.. నక్కవాగు ప్రాంతంలో ఉన్న బ్యాతోల్, ఆరుట్ల, ఎర్ధనూర్, చిద్రుప్పలో యథేచ్ఛగా కృత్రిమ ఇసుకను తయారు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా అసైన్డ్ భూముల్లోని మట్టిని కడిగి నాసిరకం ఇసుకను తయారు చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇసుక దళారులు రెవెన్యూ, ఇరిగేషన్, ప్రజాప్రతినిధుల అండతో వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. నక్కవాగు ప్రాంతంలో తయారు చేసిన కృత్రిమ ఇసుక దిబ్బలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లు, లారీల్లో పట్టణ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. దళారులు కృత్రిమ ఇసుకను నది ఇసుకలో కలిపి అమ్ముతూ మోసాలకు పాల్పడున్నారు.
అక్రమంగా తయారు చేస్తున్న కృత్రిమ ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తుంది. కృత్రిమంగా తయారు చేసిన ఒక ట్రాక్టర్ ఇసుక రూ.5వేలు, ఒక లారీకి రూ.35 నుంచి 40 వేల వరకు స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో మేలు రకం నది ఇసుక ట్రాక్టర్కు రూ.10వేలు, లారీకి రూ.90 నుంచి లక్ష వరకు ధర పలుకుతుంది. కృత్రిమ ఇసుకను పట్టణ ప్రాంతాల్లోని అడ్డాల వద్దకు తరలించి నది ఇసుకలో కలిపి విక్రయిస్తున్నారు. దీంతో దళారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది.
గతంలో అధికారులు కృత్రిమంగా తయా రు చేస్తున్న ఇసుక ఫిల్టర్లపై దాడులు నిర్వహించి ఫిల్టర్లను కూల్చివేసినా ఫలితం శూన్య మే. నాయకుల అండదండలతో రెండు రోజు ల్లో మళ్లీ యథాస్థాయిలో వ్యాపారం ప్రారంభమవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా తయారవుతున్న కృత్రిమ ఇసుకకు అడ్డుకట్ట వేయకపోతే చేపడుతున్న నిర్మాణాలతో ప్రమాదం తప్పదు. ఇండ్ల నిర్మాణాలకు నాణ్యతలేని కృత్రిమ ఇసుక వాడితే పగుళ్లు ఏర్పడి కూలిపోయే ప్రమాదం ఉందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. జిల్లా, మండల అధికారులు స్పందించి కృత్రిమ ఇసుక వ్యాపారానికి అడ్డుకట్ట వేయడంతో పాటు దళారులపై చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కృత్రిమంగా ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో ఇసుక ఫిల్టర్లన్నీ ధ్వంసం చేశాం. మళ్లీ ఇసుక ఫిల్టర్లు నడుస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దాడులు నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం. ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేస్తాం.