గజ్వేల్, ఫిబ్రవరి 5: విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయాలని, అందుకు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండల పరిధిలోని ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణితఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రతి మండలం నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులు పాల్గొనగా జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేలా కేసీఆర్ ప్రభు త్వం ‘మన ఊరు- మన బడి’ ద్వారా అధిక నిధులు ఖర్చుచేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి మరింత బలోపేతం చేసి గ్రామీణ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్ని విధాలుగా సహరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయల ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకుడు కరీమొద్దీన్ పాల్గొన్నారు.