సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 6 : ఆయిల్పామ్ సాగు లాభదాయకమని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వ్యవసాయ, ఉద్యాన పట్టు పరిశ్రమ, ఆయిల్ఫెడ్ అధికారులు, జిల్లాలోని అన్ని మండలాల రైతుబంధు సమితి గ్రామ నాయకులు, 1500 మంది రైతులతో మంత్రి హరీశ్రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయిల్పామ్ తోటల సాగు పెరుగుదలతో జిల్లా రైతులకు మంచి భవిష్యత్ ఉందని, మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్ పామ్ విరివిగా సాగు జరిగేలా డీడీలు చెల్లింపులు చేయడంలో చొరవ చూపాలని ఓ వైపు రైతులు, మరో వైపు అధికారులను మంత్రి హరీశ్రావు చైతన్య పర్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలు ఆయిల్పామ్ సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని,కానీ ఇప్పటివరకు జిల్లాలో ఆరు వేల ఎకరాలు మాత్రమే సాగు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్కరికీ 10 ఎకరాల భూమి విస్తీర్ణం కలిగిన రైతులు 3,215 మంది ఉన్నారని.. వీరి మొత్తం భూమి 50,112 ఎకరాలు ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉందని.. ఆయా రైతులు సాగుకు ముందుకు వచ్చేలా అధికారులు చొరవ చూపాలన్నారు.
ఆయిల్పామ్ సాగు కోసం వందశాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు, ఇతర రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్ అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి సాగుకు ముందుకు వచ్చేలా మార్గదర్శనం చేశారు. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధిలో రైతులతో సమావేశం నిర్వహించి చైతన్యపర్చాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, రైతుబంధు సమితి నాయకులు, ఏఈవోలు పాల్గొన్నారు.